Monday, February 18, 2013

Medicines in Health is Wealth,ఆరోగ్యమే మహాభాగ్యము లో ఔషధాలు

  •  


  •  
 
ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు - Medicines in Health is Wealth,ఆరోగ్యమే మహాభాగ్యము లో ఔషధాలు - గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...

  • ఒక వ్యక్తి శరీరములో ఏదైనా జబ్బు (disease) లేనంత మాత్రాన ... ఆ వ్యక్తీ ఆరోగ్యవంతుడని అనలేము.
ఒక వ్యక్తి ...
  • "శారీరకంగాను ,
  • మానసికంగాను ,
  • శరీరకవిధులనిర్వహణలోను ,
  • ఆర్ధికంగాను ,
  • సామాజికంగాను ...
తను ఉన్న ప్రదేశం లో సమర్ధవంతం గా నివసించ గలిగితే ... ఆరోగ్య వంతుడనబడును ".
  • (Mere absence of a disease in a person is not healthy. A person is said to be healthy " when is physically , mentally , physiologically , socially , financially " fit to live in his own circumstances .. then ... he / she is healthy)
 బతుకుకన్నా, బతికించుకోవడం కష్టమైపోయింది. ప్రాణం కన్నా ప్రాణాధార మందులు ఖరీదైపోయిన భావం ప్రజల్లో నెలకొంటోంది. కార్పొరేట్ విషవలయంలో చిక్కుకుని వైద్యం అణువణువూ ఖరీదైపోయింది. ఆరోగ్యమే మహా భాగ్యము అన్న నానుడి ఈ విధంగా నిజమైపోయింది. మందుల చీటి తాచుపాములా భయపెడుతోంది. చెట్టు పేరు చెప్పి కాయలు అమ్మిన చందంగా మందుల కంపెనీలు రకరకాల పేర్లు పెట్టి, కంపెనీ ఉద్యోగుల తెలివితేటలను, చాకచక్యాన్ని ఉపయోగించి, నారాయణుడిగా పేరొందిన డాక్టర్లను వీలయినంత ప్రలోభపెట్టి మందులమ్ముకునే రోజులొచ్చాయి. తాము అమ్మిందే మందు, తాము రాసిందే మాత్ర అన్న చందంగా వైద్యం తయారైపోయింది. మందుల దుకాణం అంటే డబ్బు లు కురిపించే చెట్టు అన్నంతగా పరిస్థితిని దిగజార్జేసారు. మందుల దుకాణం వాడు అడగకుండానే ఎమ్మార్పీపై పదిశాతం డిస్కౌంట్ ఇచ్చేస్తున్న రోజులు ఇవి. అంటే అప్పటికే కంపెనీ మందుల దుకాణం వాడి లాభం కాకుండా పది శాతం ధరను ఎమ్మార్పీగా కోట్ చేసినట్లేగా. ఇలా ఎందుకు చేయాలి? ఇలా చేయడానికి ప్రభుత్వాలు ఎందుకు అనుమతించాలి? మందులు తయారుచేయడానికి అవుతున్న ఉత్పాదక వ్యయం, అదనపు ఖర్చులు కలిసి, కనీస ధరను నిర్ణయించి, వాటిని దాటకుండా చూసి, సామాన్యుడిని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై లేదా? కానీ అలా జరగదు. ఇలాంటి తరుణంలో సామాన్యుడికి, మధ్యతరగతి ప్రజలకు కాస్త ఊరట జెనరిక్ మెడిసిన్. సాధారణంగా వివిధ ఫార్ములాలు ఉపయోగించి మందులు తయారుచేస్తారు. మాత్రలో ఏముందన్నది కొద్దిగా తెలియచేస్తూ, తమ కంపెనీ పేరునో, బ్రాండ్‌నేమ్‌నో కలసివచ్చేలా దానికి నామకరణం చేస్తారు. ఉదాహరణకు ప్యారాసెటిమోల్ మాత్రనే వివిధ కంపెనీలు వివిధ పేర్లతో విక్రయిస్తాయి. ఎవరి పేరును వారు వీలయినంత పబ్లిసిటీకి వాడుకుంటాయి. ఇందుకోసం ఫార్ములా ఎవరిదైతే వారి నుంచి పేటెంట్ హక్కుల వినియోగానికి కాను కొంత మొత్తం చెల్లించడం కూడా జరుగుతుంది. ఈ పేటెంట్ హక్కుల ఖర్చు, బ్రాండింగ్ ఖర్చు, పబ్లిసిటీ ఖర్చు కలసి, రోగి నెత్తిన గుదిబండగా మారుతున్నాయి. అదే కనుక పేటెంట్ కాలం తీరిపోయిన తరువాత, పెద్దగా బ్రాండింగ్ లేకుండా విక్రయించగలిగితే, రూపాయి మాత్ర పదిపైసలకు లభించే అవకాశం వుంది. అలాంటి అవకాశం నుంచి వచ్చినవే జెనరిక్ మందులు. నిజానికి ప్రభుత్వాలు కట్టుదిట్టంగా కృషిచేస్తే, మందుల ధరలు కట్టడి చేయడం అంతకష్టం కాదు. కానీ రాజకీయాలు, వ్యాపారాలు చెట్టాపట్టాలేసుకున్న ఈ కాలంలో అటువంటి అద్భుతాలు ఆశించడం అత్యాశ, అసాధ్యం కనుక ఇక సామాన్యుడికి కొంతలో కొంత జనరిక్ ఔషధాలే దిక్కు. ‘ఆరోగ్యమే మహాభాగ్యం’ -ఇది సామెత కాదు. అక్షర సత్యం. జీవితంలో ఎన్ని సమస్యలెదురైనా ధైర్యంగా ఎదుర్కోవచ్చుగానీ - అనారోగ్యం కమ్ముకుంటే మాత్రం మానసికంగా కృంగి కృశించి మృత్యు దరిచేరటం సర్వసాధారణం. ఈ భయాన్నీ, బతుకు మీది తీపినీ ‘క్యాష్’ చేసుకోవటమే లక్ష్యంగా పెట్టుకొన్న మందుల కంపెనీలు మానవుణ్ణి ఆర్థికంగా మరింత దిగజారుస్తున్నాయి. ఆధునిక యుగంలో సాంకేతికంగా ఎంత అభివృద్ధి సాధించినప్పటికీ - మానసిక వత్తిళ్ల నుంచీ తప్పించుకొనే మార్గాన్ని మాత్రం ఇప్పటికీ ఎప్పటికీ అనే్వషిస్తూనే ఉన్నాడు. వయసు ప్రమేయం లేకుండా హృద్రోగం.. మధుమేహం.. ఎయిడ్స్ - కేన్సర్- ఇలా వందల కొద్దీ రోగాలు మనిషిని అధః పాతాళానికి తీసుకెళ్తున్నాయి. ఇదే సూత్రాన్ని ఏళ్ల తరబడీ ఔపోసన పట్టిన మందుల కంపెనీలు ఔషధాల పేరిట జనాన్ని మోసం చేస్తున్నాయి. వాతావరణ రీత్యా వచ్చే జలుబు, దగ్గు, జ్వరంలాంటి సాధారణ రోగాలకు సైతం ‘యాంటీ బయాటిక్స్’ పేరిట ఖరీదైన మందులు వాడమంటూ ప్రేరేపిస్తోంది. ‘ఎందుకైనా మంచిది’ అన్న కానె్సప్ట్‌తో జన జీవన స్రవంతిలోకి అవి చొచ్చుకు పోతున్నాయి. అనారోగ్య సమస్య ఓవైపు.. ఆర్థిక సమస్య మరోవైపు సగటు మానవుణ్ణి మరింత కృంగదీస్తోంది. ఈ సమస్యకి పరిష్కారమే లేదా? అట్టడుగు వ్యక్తి సైతం చౌకగా మందులను కొనగలడా? ‘మెడిసిన్’ అన్నది అందని ద్రాక్షపండా? వీటన్నింటికీ ఒక్కటే సమాధానం. అదే ‘జెనరిక్ మెడిసిన్’. సామాన్యుడికి అతి తక్కువ ధరలకు మెడిసిన్స్ అందించటమే వీటి లక్ష్యం. జెనరిక్ ఔషధాలను భారత్, చైనా తదితర దేశాల్లో తక్కువ ఖర్చుతో ఉత్పత్తిని ఆరంభించారు. ఖరీదైన జబ్బులక్కూడా జెనరిక్ మందులు పనిచేస్తాయా? అన్న సందేహాన్ని పక్కనబెడితే - దీర్ఘకాలిక రోగాల నెన్నింటినో ‘జెనరిక్’ మందులు నయం చేసిన దాఖలాలు ఉన్నాయి. అన్ని కంపెనీల మందులకు మల్లే వీటి ఉత్పత్తికీ అయ్యే ఖర్చు సాధారణమయిందేం కాదు. పరిశోధనలకూ.. డాక్టర్లకూ.. సిబ్బంది జీతభత్యాలకూ, రవాణా ఖర్చులకూ ఎంతో పెట్టుబడి కావాల్సి ఉంటుంది. ఈ కంపెనీలను వేధించే మరో సమస్య - పేటెంట్ హక్కు. చట్టపరిధిలో ఉన్న సమస్యలను అధిగమించటానికి సైతం కొంత ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. వీటికితోడు ‘జెనరిక్’ ప్రచారానికి మరింత వ్యయమవుతుంది. ఈ జెనరిక్ ఔషధాల ‘పేటెంట్’ హక్కులకు కాలపరిమితి ఉండటంవల్ల వాటిని తిరిగి పొందటానికి కూడా ఖర్చవుతుంది. ఈ వ్యయ ప్రయాసలను అధిగమించి సామాన్యుడికి ‘వైద్యాన్ని’ అందించాలన్న ఆకాంక్ష కొద్దీ ఈ ‘జెనరిక్’ కంపెనీలు ఉత్పత్తిని చేస్తున్నాయి. ప్రభుత్వ మెడికల్ షాపుల్లో.. అనారోగ్యం అన్ని సమస్యల్లోకి అతి పెద్దది. ఆ భవసాగరాన్ని దాటితే కలిగే ఆనందం మాటల్లో చెప్పలేనిది. అందుకే - జెనరిక్ ఔషధాలను సామాన్యుడికి అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వ మెడికల్ షాపుల్లో వీటి విక్రయాన్ని మొదలుపెట్టింది. దేశంలో సుమారు 300 పైచిలుకు సర్కారు మెడికల్ షాపులు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం కొన్ని రాష్ట్ర కార్యాలయాల్లోనూ సర్కారు మెడికల్ షాపులను నెలకొల్పిన సంగతి తెలిసిందే. వీటిలో ‘జెనరిక్’ మెడిసిన్స్ విక్రయాలను చేపట్టి ఈ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. సమస్య ఏమిటంటే?.. భారతదేశంతోపాటు అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్, యూరప్ వంటి దేశాల్లో కొన్ని ‘జెనరిక్’ మందులపై నిషేధాన్ని విధించారు. కారణం ఏదైనప్పటికీ - 180 దేశాల్లో వీటి ఉత్పత్తిని నిలిపివేశారు. సమస్య ఏమిటంటే - జనం మనస్తత్వమే. ఖరీదైన మందులు వాడితేనే రోగం నయమవుతుందన్న నమ్మకం ఒకవైపు.. చౌకబారు మందులవల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయన్న అపోహ మరోవైపు ప్రజలను పట్టి పీడిస్తున్నాయి. ఉదాహరణకు - బ్రాండెడ్ పారాసిట్‌మల్ మాత్రల స్ట్రిప్ ఖరీదు 10 రూపాయలు ఉంటే.. జెనరిక్ మందు ఖరీదు కేవలం 2.50 మాత్రమే. ధర విషయంలో ఇంత వ్యత్యాసం ఉండటంతో ‘జెనరిక్’ మందులు పని చేయవేమోనన్న అపనమ్మకంతో అత్యధికులు బ్రాండెడ్ మందుల వైపు మొగ్గు చూపుతున్నారంటూ జెనరిక్ మందుల షాపుల సిబ్బంది వాపోవడం గమనార్హం. డాక్టర్లు కూడా ‘జెనరిక్’ మందులను ప్రిస్క్రైబ్ చేయక పోవటానికి కూడా ఇదే కారణం. సగటు మానవుని మనస్తత్వాన్నిబట్టి - ఎటువంటి రోగమైనా క్షణాల్లో నయం కావాలి. ఆట్టే శ్రమ పడకూడదు. రోగం నెమ్మదించటానికి రోజులూ నెలలూ పట్టకూడదు. వీటికితోడు అల్లోపతికి మించింది లేదన్న ప్రగాఢమైన నమ్మకం నరనరాల్లోనూ జీర్ణించుకు పోవటంవల్ల కూడా జెనరిక్ మందుల పట్ల మొగ్గు చూపకపోవటానికి ప్రధాన కారణం. ఇవన్నీ ఒక ఎతె్తైతే - డాక్టర్లూ.. ప్రముఖ మందుల ఉత్పత్తి కంపెనీల మధ్య ‘అనుసంధానం’ ఉండటం. దీంతో నాణ్యత విషయం పక్కనబెట్టి.. ఆయా ఉత్పత్తులను జనం నెత్తిన రుద్దటం జరుగుతోంది. ఇన్ని సమస్యల మధ్య ‘జెనరిక్’ మందుల గురించిన ప్రచారం అంతంత మాత్రంగా ఉండటం వల్ల ఈ షాపుల వైపు ఎవరూ కనె్నత్తి చూడటం లేదని అంటున్నారు కొంతమంది వ్యాపారులు. తక్షణ కర్తవ్యం? ‘జెనరిక్’ మందుల ఉత్పత్తి ఈనాటిది కాదు. ప్రజల్లో వీటిపట్ల సరైన అవగాహన కల్పించటానికి ప్రభుత్వం తీసుకుంటున్న తక్షణ చర్యలూ కనిపించటం లేదు. ఇరవై ఏళ్ల క్రితమే దీని గురించి ఆలోచించి ఉంటే పరిస్థితి ఈనాటికి చక్కబడేదని కొంతమంది వాదన. ప్రముఖ మందుల కంపెనీల గుత్త్ధాపత్యం.. వ్యాపారవేత్తల మార్కెట్ పనితనం.. ప్రముఖ ఆస్పత్రులనూ.. వైద్యులను తమ వ్యాపార దృక్పథంతో ఆకట్టుకోవటం ఇవన్నీ ‘జెనరిక్’ మందులకు మైనస్‌లుగా పరిణమిస్తున్నాయి. ఆ పోటీని తట్టుకోవటం కష్టసాధ్యంగా మారింది. మరోవైపు రాజకీయ పలుకుబడి కూడా పనిచేస్తూండటంతో ‘జెనరిక్’ జన సామాన్యంలోకి వెళ్లలేకపోతోంది. దీనికి ఒక్కటే పరిష్కారం. ప్రజల్లో చైతన్యం తీసుకురావటం. ప్రచారాన్ని ముమ్మరం చేయటం. వైద్య సిబ్బందిని ‘జెనరిక్’ మందులు రాసేట్టు ప్రేరేపించటం. ప్రభుత్వ నిర్ణయం! ‘జెనరిక్’ మందుల పట్ల జనానికి అవగాహన కలిగించేందుకు కేంద్ర ప్రభుత్వం తక్షణ చర్యలకు పూనుకుంది. ప్రభుత్వ ఆస్పత్రులలో వీటిని ఉచితంగా అందించటం.. డాక్టర్లు కూడా ఈ మందులను మాత్రమే రోగులకు రాసేట్టు చేయటం. బ్రాండెడ్ మందులను వాడుతున్నట్టయితే - అవి ఏ నిమిత్తం వాడుతున్నారో? బ్రాండెడ్ మందులకు ప్రత్యామ్నాయంగా జెనరిక్ మందులు లేని సమయాల్లో మాత్రమే వీటిని వాడేట్టు చర్యలు చేపట్టారు. ప్రతి ప్రభుత్వ ఆస్పత్రిలోనూ ‘జెనరిక్’ మందుల లిస్ట్‌ను ఉంచాలన్న నియమం కూడా పెట్టారు. ప్రభుత్వం అనుసరించే ఈ విధానం వల్ల ప్రముఖ మందుల కంపెనీలు మూత పడే పరిస్థితి వచ్చినప్పటికీ.. ప్రభుత్వం వెనుకడుగు వేసే ప్రసక్తి లేదన్న మాట వినిపిస్తోంది. ఏటా భారతదేశం మార్కెట్‌లో సుమారు 600 కోట్ల రూపాయల మెడిసిన్ వ్యాపారం జరుగుతోంది. ఈ వ్యాపారంలో ఎంతోమంది బడా వ్యాపారవేత్తలు పెట్టుబడులు పెట్టారు. లాభసాటి వ్యాపారం కాబట్టి వెనుకకు తగ్గే ప్రస్తావన ఉండదు. ఐతే - జెనరిక్ మెడిసిన్లు కనుక పూర్తి స్థాయిలో మార్కెట్‌లో ఉన్నట్టయితే.. 290 కోట్ల రూపాయల వ్యాపారం చేయొచ్చని ఒక అంచనా. అంటే ‘జెనరిక్’ మందులు సగానికి సగం మార్కెట్‌ని ఏలతాయన్న మాట వాస్తవం. ధరల్లో వ్యత్యాసం జెనరిక్ ఔషధాలు మార్కెట్లలో రెండు రకాలుగా లభ్యమవుతాయి. మొదటిది ‘రసాయనం’ పేరుతో ఉత్పత్తి అవుతుంది. ఉదా: పారాసిట్‌మల్, తదితరాలు. రెండవది ‘జెనరిక్’ పేరుతో మార్కెట్‌లో దొరుకుతాయి. ఉదా: పారాసిట్‌మల్ - సిప్లా, పారాసిట్‌మల్ - ర్యాన్‌బాక్సీ. జెనరిక్ మందుల ధరల్లో ఉండే వ్యత్యాసానికి కారణం ఏమిటంటే - బ్రాండెడ్ కంపెనీలు ఆయా మందుల పేటెంట్ హక్కు కాలపరిమితి ముగిసిన తర్వాత.. దాన్ని ‘జెనెరిక్’ పేరుతో మార్కెట్‌లో అమ్ముకోవచ్చు. పేటెంట్ హక్కుల ఖర్చు తప్పుతుంది కాబట్టి దాన్ని తక్కువ ధరకు అమ్మే వీలుంటుంది. ఇక్కడ మళ్లీ ఒక తిరకాసు ఉంది. బ్రాండెడ్ కంపెనీల మందులు అమ్మటం ద్వారా వచ్చే కమిషన్ చాలా ఎక్కువగా ఉండటం వల్ల కొన్ని మెడికల్ షాపుల్లో - జెనరిక్ మందులు లేవన్న బోర్డు ఉంచటం సర్వసాధారణమై పోయింది. ఇంకో మార్గంలో - బ్రాండెడ్ మందుల ఎంఆర్‌పి ధరకన్నా జెనరిక్ మందుల ఎంఆర్‌పి ధర ఎక్కువగా ఉన్నట్టు చూపించటం. ఇంత జరుగుతున్నా ఇది మోసం అన్న సంగతి ప్రజలు కనిపెట్టలేక పోతున్నారు. ‘కట్నం వద్దన్న పెళ్లికొడుకు’లో లోపాలను వెతికే తంతు మాదిరిగానే.. ధర తక్కువయినా జెనరిక్ మందుల జోలికి వెళ్లకపోవటం చూస్తూంటే ప్రజల అజ్ఞానానికి బాధపడాలో.. వారిని చూసి జాలి పడాలో అర్థం కావటం లేదని ఒక ప్రముఖ వైద్య శాస్తవ్రేత్త అంటున్నారంటే పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అర్థమవుతుంది. ఆరోగ్యం గురించిన ఖర్చు? భారతదేశంలో సగటున ప్రతి వ్యక్తి నిర్ణీత వయో పరిమితిలో ఆరోగ్య సమతుల్యత కోసం తమ ఆదాయం నుండి సుమారు 78 శాతం ఖర్చు చేస్తున్నట్టు అంచనా. అనారోగ్య స్థితిని అంచనా వేసేందుకు టెస్ట్‌లూ గట్రా చేయించుకొనే దానికన్నా కూడా 72 శాతం వరకూ మెడిసిన్స్ పైనే ఖర్చు పెట్టాల్సి వస్తోంది. ఇటీవలి కాలంలో దేశంలో మధుమేహం, కేన్సర్, హెచ్‌ఐవి లాంటి దీర్ఘకాలిక రోగాల బారిన పడేవారి సంఖ్య అధికంగా ఉంటోంది. ఒక్కమాటలో చెప్పాలంటే - దీర్ఘకాలిక రోగాలకు ‘జెనరిక్’ ఔషధాలు వరం లాంటివి. కేన్సర్ విషయానికి వస్తే - ఖరీదైన జబ్బు. 2008 మెకెన్సీ సర్వే ప్రకారం భారతదేశంలో ఒక కేన్సర్ రోగి చికిత్స నిమిత్తం ఖర్చు చేసేది సరాసరిన 3.27 లక్షల రూపాయలు. హార్ట్ పేషెంట్‌కి అయ్యే ఖర్చు 30 వేలు. ఇదీ కేవలం మందుల వరకూ మాత్రమే. మూత్ర పిండాల కేన్సర్ అంటే ఇక చెప్పనక్కర్లేదు. ఒక నెలకి 120 మాత్రలకు అయ్యే ఖర్చు అక్షరాలా మూడు లక్షల రూపాయలు. ఇక్కడ జెనరిక్ మందులకూ.. కంపెనీ మందులకూ వ్యత్యాసాన్ని గమనించండి. ఆయా దీర్ఘకాలిక రోగాలకు జెనరిక్ మందుల ద్వారా 8-9 వేల రూపాయల మధ్య అవుతుంది. నాట్కో ఫార్మాకు ఈ మాత్రలను తయారుచేయడానికి అనుమతి ఉన్నప్పటికీ పేటెంట్ హక్కులు మాత్రం జర్మనీ బీయర్ కంపెనీకి ఉండటం వల్ల చట్టపరమైన సమస్యలు ఉత్పన్న మవుతాయి. స్థానిక కంపెనీ ఈ ఔషధాలను తయారుచేయడానికి అనుమతి ఉన్నప్పటికీ పేటెంట్ హక్కుల కోసం అయ్యే ఖర్చు తడిసి మోపెడంత. దీనిపై ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఆపరేట్ బోర్డు మీద న్యాయ పోరాటం చేస్తే.. భారతదేశంలోని ‘జెనరిక్’ మందుల కంపెనీకి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. ఇది సంతోషకర పరిణామం. అయితే ఇదే సందర్భంలో మరో విషయం జ్ఞప్తికి తెచ్చుకోవాలి. భారత ఔషధ నియంత్రణ ఆదేశాల ప్రకారం జెనరిక్ పేరుకు ఔషధపరమైన అనుమతి ఇవ్వడం.. బ్రాండ్ లేదా ట్రేడ్ పేరున్న మందులకు అనుమతి లేకపోవడం గమనించాల్సిన విషయం. అమెరికా, బ్రిటన్ లాంటి దేశాల్లో ధనిక వర్గానికీ పేదలకు అందరికీ ఒకే రీతిన చికిత్సలను అందిస్తారు. ఇక్కడ ఎక్కువగా జెనరిక్ మందులు వాడకంలో ఉంటాయి. భారతదేశంలో కూడా ఈ విధానాన్ని కచ్చితంగా అమలు చేసినట్టయితే అట్టడుగు వర్గాల వారు కూడా హాయిగా ఊపిరి పీల్చుకుంటారు. రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని యుపిఎ ప్రభుత్వం ‘జెనరిక్’ వ్యవస్థకు గట్టి పునాది వేయాలని నిర్ణయించుకుంది. ఇప్పటికే ‘జెనరిక్’ మందుల షాపులకు ప్రారంభోత్సవం చేసి పేదలకు ఉచితంగా ఆయా మందులను పంచిపెడుతున్నారు. ఐతే - రాబోయే ప్రభుత్వాలు ‘జెనరిక్’ను అమలు చేస్తాయా? లేదా అన్న వాదనలు వినపడుతున్నప్పటికీ.. నింగి కెగసిన బ్రాండెడ్ కంపెనీల మందుల ధరలు పేదవాడికి అతి చేరువలోకి వస్తాయనటంలో ఎటువంటి సందేహం లేదు. మందుల ఉత్పత్తి కంపెనీల గుత్త్ధాపత్యం నుండి రోగులను రక్షించటానికి ప్రభుత్వాలు సరైన నిర్ణయం తీసుకుని ఆచరించడానికి నిబద్ధతతో వ్యవహరించినప్పుడే ఏ పథకమైనా సత్ఫలితాల నిస్తుంది. కానీ కొరవడింది అటువంటి నిజాయితీనే? జెనరిక్ ఔషధాలు అంటే ఏమిటి? బాలీవుడ్ నటుడు అమీర్‌ఖాన్ సమర్పించిన ‘సత్యమేవ జయతే’ రియాల్టీ షోలో ఈ విషయం గురించిన సుదీర్ఘ చర్చ జరిగింది. భారతీయ వైద్య వ్యవస్థలో ఎన్నో అంశాలను ఈ షో వెలికి తీసింది. రోగికి అవసరం ఉన్నా లేకపోయినా శస్తచ్రికిత్సలు చేయడం. సాధారణ జ్వరానికి కూడా లెక్కకుమించి టెస్ట్‌లు రాయడం.. అవన్నీ తమతమ ల్యాబ్‌లలోనే చేయించాలని షరతు విధించటం. పొరపాటున వేరే ల్యాబ్‌లో పరీక్ష చేయించుకొని రిపోర్టు పట్టుకొస్తే.. ఆక్షేపించటం. మళ్లీ వేరే టెస్టులు రాయడం. మోతాదుకు మించి ఖరీదైన మందులు రాయడం. మెడికల్ షాపుల నుండి కమీషన్లకు, మందుల కంపెనీల నుండి ఆకర్షణీయమైన బహుమతులనూ, కమీషన్లను పొందటం కోసం ఆయా కంపెనీల ఉత్పత్తులను రోగులకు అంటగట్టడం. ఖరీదైన మందులూ యాంటీ బయాటిక్స్ రాయడం.. వంటి ఎన్నో అర్థంపర్థంలేని టెస్టుల బాగోతాన్ని తెర మీదికి తెచ్చింది. ఆ సంఘటనలను బేరీజు వేసుకొన్న కొంతమంది ‘జెనరిక్’ మందుల పట్ల ఆసక్తిని చూపటం ఆరంభమైంది. పేటెంట్ కాలపరిమితి ముగిసినప్పటికీ అదే ఫార్ములాని ఉపయోగించి అదే కంపెనీ అదే తరహాలో ఉత్పత్తి చేసే మందులను ‘జెనరిక్’ మెడిసిన్స్ అంటారు. జ్వరాన్ని తగ్గించటానికి వాడే మందు ‘పారాసిట్‌మల్’. ఇదొక రసాయన ఫార్ములా. ఈ ఫార్ములాని అనుసరించే వివిధ కంపెనీలు వివిధ పేర్లతో మందులను మార్కెట్‌లో రిలీజ్ చేస్తాయి. షుగర్ పేషెంట్లు వాడే ‘గ్లుకోఫేజ్’ అనే మందును స్విబ్ కంపెనీ తయారుచేస్తుంది. పేటెంట్ హక్కులు కాలపరిమితి ముగిసిన తరువాత అదే కంపెనీ అదే మందును ‘మెట్‌ఫార్మిన్’ అనే పేరున రసాయన సంయుక్తమైన పేరుతో మార్కెట్‌లో అమ్ముతోంది. ఈ జెనరిక్ ఉత్పత్తికి కంపెనీ పెట్టిన పేరు ‘మెట్-500’. ప్రతి కంపెనీ ఆయా మందులపై పేటెంట్ హక్కును కలిగి ఉంటుంది. కాల పరిమితి ముగియటమూ తెలిసిందే. అంటే - ప్రత్యేకించి ఆ మందుకి మరి ఎటువంటి ప్రయోగాలూ చేయటం ఉండదు. ఖర్చూ ఉండదు. కాబట్టి అదే ఫార్ములాని తక్కువ ధరకు అమ్ముకోవచ్చు. అంటే ఒక విధంగా పెట్టుబడిలేని వ్యాపారం. లాభాలూ వస్తాయి. కానీ - ఏదో కారణంగా ‘జెనరిక్’ మందులను జనంలోకి తీసుకెళ్లటానికి మందుల కంపెనీలు ముందుకు రావటంలేదు. ఒక వస్తువు తయారుచేయాలంటే ఎంతో కొంత ఖర్చవుతుంది. ఆ ఖర్చు మాత్రం ఎందుకు పెట్టాలి? ఎలాగూ బ్రాండ్ పేరుతో అమ్ముకొంటే వస్తూన్న లాభాలు చాలు అన్న ఉద్దేశంతో ‘జెనరిక్’ మందులపై ప్రముఖ కంపెనీలు సైతం అంతగా దృష్టి పెడుతున్న దాఖలాలు లేవు. అదే ఫార్ములాతో బ్రాండెడ్ కంపెనీ మందులు మార్కెట్‌లో లభ్యమవుతూంటే.. దీన్ని ఎందుకు తీసుకోవాలన్న అభిప్రాయం ప్రజల్లో పాతుకుని ఉండటంవల్ల కూడా ‘జెనరిక్’ పట్ల అనుకున్న ఫలితాలు రావటంలేదు. భారతదేశం విషయానికి వస్తే - కొన్ని ప్రముఖ కంపెనీలైన సిప్లా, రెడ్డీ ల్యాబ్స్, ర్యాన్‌బాక్సీ వంటివి తక్కువ ధరలో ‘జెనరిక్’ మందులను ఉత్పత్తి చేస్తూ కొంతలో కొంత తోడ్పడుతున్నాయి. ఒక్కమాటలో చెప్పాలంటే - ఆయా కంపెనీలు వాడే మందుల్లో ఏయే రసాయనాలూ ఫార్ములా ఉంటుందో.. అదే ఫార్ములా ‘జెనరిక్’ మందుల్లోనూ ఉంటుందన్న వాస్తవాన్ని గ్రహించగలిగితే చాలు - జెనరిక్‌కి ఇక తిరుగుండదు. భారతదేశంలో జెనరిక్ మందుల వినియోగం ఏటా పెరుగుతోంది. గత యేడాదితో పోలిస్తే ఇది 40 శాతానికి పెరిగింది. అదే పాశ్చాత్య దేశాల్లో 80 శాతం వరకు వినియోగిస్తున్నారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. బ్రాండెడ్ ఎందుకు అంత ఖరీదు? ఒక మందును మార్కెట్‌లోకి రిలీజ్ చేయాలన్నది పెద్ద ప్రాజెక్ట్. కొత్త ఔషధాన్ని కనిపెట్టాలంటే దానిపై ప్రయోగాలు చేయాల్సి ఉంటుంది. దానికి శాస్తవ్రేత్తలు కావాలి. ల్యాబ్‌ల అవసరం ఉంటుంది. పరిశోధనలు జరిగినా కొన్నికొన్ని సందర్భాల్లో అవి సత్ఫలితాలను ఇవ్వవు. ఫార్ములా తయారైనా.. కొన్ని వికటించి.. మార్కెట్‌కి పంపక మునుపే ధ్వంసం చేయాల్సి ఉంటుంది. వందల సంఖ్యలో ఉద్యోగులు. వారి జీతభత్యాలు. వైద్యులు తమ మందులను రాయడానికి వారికివ్వాల్సిన కమీషన్.. మెడికల్ షాపుల్లో అమ్మి పెట్టేందుకు కమీషన్లు.. ఇలా ఎనె్నన్నో సమస్యలు ఎదురవుతాయి. ఒక టాబ్లెట్ తయారుచేయటానికి ఐదు రూపాయలు అయిందంటే.. దాని చుట్టూ అల్లుకున్న ఈ వలయాన్ని ఛేదించేప్పటికి ఖర్చు తడిసి మోపెడవుతుంది. దీనికి కంపెనీలను నిందించాల్సిన పనిలేదు. ఒక మందుల కంపెనీ సంవత్సరాల తరబడి పరిశోధనలు చేసి కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఒక కొత్త ఔషధాన్ని కనిపెడితే, ఆ మందుపై పేటెంట్ కాలపరిమితి 10-15 సంవత్సరాల మధ్యకాలం వరకూ ఉంటుంది. కాలపరిమితి తీరిన వెంటనే ఫార్ములాని విడుదల చేయాల్సి ఉంటుంది. అంటే - అదే ఫార్ములాతో మిగతా కంపెనీలు కూడా మందులను ఉత్పత్తి చేసుకోవచ్చు. మందులను రకరకాల పేర్లతో మార్కెట్‌లో ఆయా కంపెనీలు ఫుడ్ అండ్ డ్రగ్స్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌డిఏ) అనుమతితో విడుదల చేస్తాయి. విస్తృత ప్రచారం జెనరిక్ ఔషధాలపై ప్రభుత్వం విస్తృత ప్రచారాన్ని నిర్వహించాల్సి ఉంది. జెనరిక్ మెడిసిన్ పట్ల ప్రజల్లో ఉన్న అపోహను తొలగించాలి. బ్రాండెడ్ ఫార్ములానే ‘జెనరిక్’లోనూ ఉపయోగిస్తారన్న నిజాన్ని ప్రజలకు వెల్లడించాలి. ప్రభుత్వ ఆస్పత్రులలో ‘జెనరిక్’ మందులను ఉచితంగా పంపిణీ చేయటంవల్ల కొంతలో కొంత లాభం చేకూరే అవకాశం ఉంది. ‘రోగం వస్తే కాటికే’ అన్న మాటను మరిచిపోయే రోజు ఎలా ఉంటుందో చెప్పాలి.

-నిర్మల@Andhrabhoomi Telugu daily
  • ===================
 Visit my website - > Dr.Seshagirirao.com/

No comments:

Post a Comment

Your comment is very important to improve the Web blog.