Tuesday, May 31, 2011

ఎనీమియా , రక్తహీనత,Anaemia




ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -ఎనీమియా , రక్తహీనత,Anaemia- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...


రక్త హీనత అంటే ఏమిటి?

మన శరీరంలోని రక్తం ఎర్రగా ఉండడానికి కారణం అందులోని హీమోగ్లోబిన్ అనే పదార్థం. ఇది తయారవడానికి మాంసకృత్తులతో పాటు ఇనుము అనే పోషక పదార్థం ముఖ్యంగా అవసరం. మన శరీరంలో హీమోగ్లోబిన్ పరిమాణం ఒక మోతాదులో (16 mg%) ఉంటుంది. ఉదాహరణకు మగవారిలో ప్రతి 100 గ్రాముల రక్తంలో 13 గ్రాములు, ఆడవారిలో 12 గ్రాములు, 6 సంవత్సరంలోపు పిల్లల్లో 11 గ్రాములు, గర్భిణీ స్త్రీలలో 11 గ్రాములు, బాలింతలలో 12 గ్రాములు, 6 నుండి 12 సం.ల లోపు పిల్లలో్ల 12 గ్రాములు ఉండాలి. ఒక వేళ హీమోగ్లోబిన్ మోతాదు ఈ విలువల కన్నా తగ్గితే రక్త హీనతతో వారు బాధపడుతున్నట్లు పరిగణించవచ్చు. రక్తహీనతకు (అనీమియా) గురైన వ్యక్తి శరీ రంలో ఎర్ర రక్త కణాలు (రెడ్‌బ్లడ్‌సెల్స్‌- ఆర్‌ బిసి- లేదా ఎరిత్రోసైట్స్‌) సంఖ్య తగ్గిపోతుంది. రక్త పరీక్షలో ఆర్‌బిసి కౌంట్‌ ద్వారా రోగి రక్తంలో ఎన్ని ఎర్రరక్తకణాలున్నాయనే విష యాన్ని తెలుసుకోవచ్చు. రక్తంలో ఎర్ర రక్త కణాల సంఖ్య 38 శాతం నుంచి 48 శాతం వరకూ ఉంటుంది. ఆర్‌బిసి లో ఆక్సిజన్‌ను తీసుకునివెళ్లే కణాలను హీమో గ్లోబిన్‌ అంటారు.

ఆరోగ్యవంతుల్లో హీమోగ్లోబిన్‌ ఒక డెసి లీటర్‌కు 12 గ్రాములుంచి 16 గ్రాముల మధ్య ఉంటుంది. ఆర్‌బిసి కౌంట్‌ ఒక మైక్రోలీటర్‌కు 4.4నుంచి 5.8 మిలియన్ల వరకూ ఉంటుంది. ఆర్‌బిసిలోని హీమోగ్లోబిన్‌ ఆక్సిజన్‌ను శరీరంలోని అన్ని భాగాలకు తీసుకువెళుతుంది. ఆక్సిజన్‌ రవాణా వ్యవస్థగా ఎర్ర కణాలు ఉపకరిస్తాయి. ఆక్సిజన్‌ శరీరానికి ఇంధనంగా ఉపయోగపడుతుంది.

రక్తహీనతకు గురైన వ్యక్తిలో అవసరమైన స్థాయిలో ఎర్ర రక్త కణాలు ఉండవు. ఫలితంగా శరీరానికి అవసరమైన ఆక్సిజన్‌ అందదు. రోగి ఎంతో అలసట పొందడం, చివరకు శ్వాస తీసు కోవడానికి కూడా కష్టపడాల్సి వస్తుంది. రక్తహీనతతో బాధపడుతున్న వ్యక్తులు తమలో శక్తి పూర్తిగా నశించిపోయినట్లు భావిస్తారు . ఆర్‌బిసి లలో ఉన్న హీమోగ్లోబిన్‌ కణాల నుంచి కార్బన్‌ డై ఆక్సైడ్‌ అనే వ్యర్థ పదార్థాన్ని సేకరించి, ఊపిరితిత్తులకు అందజేస్తుంది. ఊపిరితిత్తులు ఈ వ్యర్థపదార్థాన్ని విసర్జిస్తాయి.

శరీరంలో ఉండే ఎరిత్రోప్రోటీన్‌ అనే హార్మోన్‌ బోన్‌ మారోను ఉత్తేజపరిచి, ఎర్ర రక్తకణాల సంఖ్యను నియంత్రించేలా చేస్తుంది. శరీరంలో ఉండే దాదాపు మొత్తం ఎరిత్రోప్రోటీన్‌ను మూత్రపిండాలు ఉత్పత్తి చేస్తాయి. అక్కడినుంచి ఎరిత్రోప్రోటీన్‌ బోన్‌మారోకు చేరుతుంది. ఇక్కడే ఎర్ర రక్తకణాలు తయారవుతాయి. ఒక వ్యక్తి మూత్రపిండాల వ్యాధికి గురైన ప్పుడు మూత్రపిండాలు అవసరమైన స్థాయిలో ఎరిత్రోప్రోటీన్‌ను ఉత్పత్తి చేయలేవు. ఎరిత్రోప్రోటీన్‌ లేకుండా, బోన్‌మారో తగి నంత సంఖ్యలో ఎర్ర రక్తకణాలను తయారు చేయలేవు. ఫలితంగా శరీరావసరాలకు సరిపో యేంత ఆక్సిజన్‌ అందదు.మూత్రపిండాలు విషపదార్థాలను, ద్రవాలను శరీరంనుంచి తొలగిస్తాయి. మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్న వారిలో ఈ పని డయాలిసిస్‌ ద్వారా కొంత జరుగుతుంది.కాని, ఎరిత్రోప్రోటీన్‌ను తయారు చేయడం మాత్రం మూత్రపిండాల వ్యాధికి గురైన ప్పుడు సంభవం కాదు.

కారణాలు : స్త్రీలలో, పిల్లల్లో కనపడే ముఖ్యమైన బలహీనత – రక్తం తక్కువగా ఉండడం ఇది ముఖ్యంగా మూడు కారణాల వలన వచ్చును.
1.పౌష్టికాహార లోపం – ఐరన్ (ఇనుము ధాతువు) కలిగిన ఆకుకూరలు (తోటకూర, గోంగూర) బెల్లం, మాంసాహారంలోను ఎక్కువ నిలువలుండును. ఇవి గలిగిన ఆహారం సమతుల్యంతో తీసుకోకపోవడం.
2.రక్తం నష్టపోవడం – స్త్రీలు ఋతుస్రావం ద్వారా, పిల్లలు కడుపులో పొట్టపురుగులు ద్వారా, క్రమేపి రక్తాన్ని కోల్పోయి, రక్తహీనతకి గురి అవుతారు.
3.రక్తం తయారీలో అవరోధం – జబ్బుల వలన ఉదా. మలేరియా, రక్తంలోని ఎర్ర కణాలు ధ్వంసం అయి మరల పెరగవు...దీంతో రక్తం తయారవక రక్తహీనత కనపడుతుంది.

లక్షణాలు :
బలహీనం, నిరాశక్తత, సాధారణ పనులకే ఆయాసం రావడం.
1) నాలుక, కనురెప్పలలోపలి భాగాలు పాలిపోవడం, 2) అలసట, 3) చికాకు, 4) ఆకలి లేకపోవడం, 5) మైకం, కళ్ళు తిరగడం, 6) అరచేతుల్లో చెమట, 7) చేతుల గోళ్ళు వంగి గుంటలు పడడం 8) పాదాలలో నీరు చేరడం, 9) చిన్న పిల్లల్లో అయితే చదువులో అశ్రద్ధ, ఆటల్లో అనాసక్తి, నీరసం.

రక్త హీనత ఎవరిలో ఎక్కువగా కనబడుతుంద?

గర్భిణీ స్త్రీలు, బాలింతలు, 15-45 సం.వయస్సు గల స్త్రీలు, 11 సం.ల లోపు పిల్లలలో రక్తహీనత ఎక్కువగా ఉంటుంది. అయితే మగవారిలో కూడా రక్తహీనత చోటుచేసుకోవడం అసాధారణం కాదు.

రక్త హీనత వల్ల కలిగే దుష్పరిణామాలు
బలహీనత, గర్భస్రావం, తక్కువ బరువుతో బిడ్డ పుట్టడం, పుట్టిన బిడ్డ లేదా తల్లి చనిపోవడం, పనిచేసే సామర్థ్యం తగ్గుదల, రోగాలు తేలికగా వెంటవెంటనే రావడం, చదువులో వెనుకపడడం, ఎక్కువసేపు పనిచేయలేకపోవడం, ఆటలు ఆడలేకపోవడం మైదలైనవి.

రక్త హీనతను నివారించడం ఎలా

చికిత్సా విధానం : చిన్న పిల్లలకి పొట్టపురుగుల మందు ఇవ్వాలి. మల విసర్జన తరువాత చేతులు సబ్బుతో తోముకునేలా అలవాటు చేయించాలి. ఇనుము ఎక్కువగా ఉండే ఆహారం (ఆకుకూరలు, పొట్టుతోటి ధాన్యాలు, మాంసాహారం) తీసుకునేట్లు చేయాలి. యుక్త వయస్సు నుండి సంతానం పొందు వయసు మధ్యలో గల స్త్రీలందరికి ఎ.ఎన్.ఎం. సహాయంతో ఉచితంగా లభ్యం అయ్యే ఐరన్, పోలిక్ యాసిడ్ మాత్రలు ఇవ్వాలి.

రక్త హీనతను నివారించడానికి భారత ప్రభుత్వం దేశ వ్యాప్తంగా ఒక ప్రజారోగ్య కార్యక్రమాన్ని చేపట్టింది. రక్త హీనతకు తేలికగా గురికాగల గర్భిణీ స్త్రీలు, బాలింతలు, చిన్న పిల్లలకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లేదా ఉపకేంద్రం ద్వారా ఇనుమున్న ఎర్రగోలీలు (ఐరన్, ఫోలిక్ ఆసిడ్ మాత్రలు) ఉచితంగా ఇవ్వబడుతున్నాయి. ఈ గోలీలను గర్భిణీ స్త్రీలయితే 6వ నెల మొదటి నుండి 100 రోజుల పాటు, బాలింతలు చనుబాలు యిస్తున్నంత కాలం లేదా 100 రోజుల పాటు, 11 సం. వయస్సులోపున్న రక్త హీనతగల పిల్లలు సంవత్సరంలో కనీసం 100 రోజులపాటు క్రమం తప్పకుండా రోజుకొక్కగోలీ చొప్పున తీసుకోవడం వల్ల వారి శరీరానికి పూర్తి రక్తపుష్టి చేకూరుతుంది.
ఈ మాత్రలు తీసుకొనేవారి మలం నల్లబడడం, వికారం కల్గడం సహజం. కాబట్టి భయపడవలసిన అవసరం లేదు.

ఆకుకూరలు రక్త హీనత నివారణకు సులభమైన ఉపాయం --- ఇనుము ఎక్కువగా వుండి, సులభంగా లభించి, చవకగా అందరికీ అందుబాటులో ఉండే అన్ని రకాల తాజా ఆకుకూరలు అంటే తోటకూర, పుంటికూర, పాలకూర, మెంతి కూర, బచ్చలి కూర, గంగబాయిల కూర రోజు తీసుకోవడం వల్ల రక్తహీనత రాకుండా చూసుకోవచ్చు. ఇవేగాక ఖరీదైన ఎండినపండ్లు, అంటే బాదం, జీడిపప్పు, ఎండు ఖర్జూర్, మాంసం, కాలేయం వంటి పదార్థాల్లో కూడా యినుము పుష్కలంగా లభిస్తుంది. వీటితోపాటు, రోజూ తీసుకొనే ఆహారంలో మొలకెత్తిన పప్పుధాన్యాలు విటమిన్ సి ఎక్కువగా వుండి నిమ్మ, ఉసిరి, జామ లాంటివి కలిపి తీసుకోవడం ద్వారా రక్త హీనత రాకుండా చూసుకోవచ్చు.

రక్త హీనత నివారణకు నూతన పద్ధతి : దేశ ప్రజలలో అధికశాతం రక్తహీనతకు గురి అవుతున్నారు. కాబట్టి రక్తహీనత నివారణకు మనం మామూలుగా తీసుకొనే ఉప్పులో ఇనుమును కలిపే శాస్త్రీయ పద్ధతిని జాతీయ పోషకాహార సంస్థ వారు కనుగొన్నారు. మామూలు ఉప్పు బదులుగా క్రొత్తగా తయారుచేసిన ఇనుము కలిపిన ఉప్పును రోజూ వంటలో వాడడం ద్వారా ఇనుము లోపం వలన వచ్చే రక్త హీనతను నివారించవచ్చును. ఈ ఇనుము కలిపిన ఉప్పు ప్రస్తుతం కొన్ని పట్టణ ప్రాంతాల్లో లభ్యం అవుతోంది.

రక్త హీనతను అశ్రద్ధ చేయకండి. అది నీరసానికి బలహీనతకు మాత్రమే దారితీయదు. ప్రాణాహానిని కూడా కల్గించవచ్చు. రక్తహీనతను దరిచేరనీయకండి. ఇనుము పుష్కలంగా ఉన్న ఆహార పదార్థాలు రోజూ తీసుకోండి. రక్తహీనత ఉన్నవారు ఐరన్, ఫోలిక్ యాసిడ్ మాత్రలను క్రమం తప్పకుండా వందరోజులు తీసుకోండి. మీ గ్రామ ప్రభుత్వ ఆరోగ్య సిబ్బందిని గాని, ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గాని, ప్రభుత్వ ఆసుపత్రిలోగాని సంప్రదించి దీనిని నివారించే పద్ధతుల వివరాలను విపులంగా తెలుసుకొని పాటించండి.

మంచి ఆహారంతో ఎనీమియాకు దూరం...
--ప్రస్తుతం మహిళలను వేధిస్తోన్న సమస్య ఎనీమియా (రక్తహీనత). లేచింది మొదలు గొడ్డు చాకిరీ చేసే మహిళలకు రోజంతా... పనితోనే సరిపోతుంటే ఇక తినేందుకు సమయమెక్కడ ఉంటుంది చెప్పండి. ఒకవేళ ఉన్నా ఆ... ఏం తింటాలే... అని ఊరుకునే మహిళలు ఎంతమందో..! దీని ఫలితమే రక్తహీనత.

విటమిన్ బి12 తప్పనిసరి..!

తాజా కూరగాయలలో పాలకూర, క్యారట్, ముల్లంగి, బీట్‌రూట్, టమోటాలలోనూ.... ఇక పండ్ల విషయానికొస్తే... అరటిపండు, యాపిల్, ద్రాక్ష, ఆప్రికాట్‌లలోనూ ఐరన్ అధికంగా లభిస్తుంది. అరటిలో ఉండే ఫోలిక్ ఆసిడ్, బి12 విటమిన్‌లు రక్తహీనత నివారణకు ఎంతగానో ఉపయోగపడుతుంది...

అంతేగాకుండా వారు తీసుకునే ఆహారంలో పోషక విలువలు తగ్గిపోవడం వల్ల, రుతుసమయంలో అధిక రక్తస్రావం వల్ల, ఫైల్స్ సమస్య వల్ల కూడా రక్తహీనత వస్తుంది. దీనివల్ల రక్తంలో ఎర్రకణాల సంఖ్య తగ్గిపోయి శారీరక బలహీనత ఏర్పడుతుంది. దీని కారణంగా ఒంట్లో నీరసంగా ఉండటం, కళ్ళు తిరగటం, జ్ఞాపకశక్తి తగ్గిపోవడం, తలనొప్పి తదితర సమస్యలు కలుగుతాయి.

మరి దీనికి పరిష్కారమే లేదా..? అంటే ఉందని చెప్పాలి. అదేంటంటే... మందులకన్నా... ప్రతిరోజూ వీరు తీసుకునే ఆహారంలో ఐరన్ అధికంగా లభించే వాటినే తీసుకోవాలి. ఐరన్ ఎక్కువగా కాయగూరలు, పండ్లలో ఉంటుంది.

రక్తహీనత బారినపడొద్దు-ముందే జాగ్రత్త పడటం :
--మనదేశంలో రక్తహీనతతో బాధపడుతున్న స్త్రీలు, పిల్లలు ఎంతోమంది. దీని బారినపడ్డవారి రక్తంలో ఎర్రకణాలు తగ్గిపోతాయి. దీంతో శరీరంలోని ఇతర భాగాలకు ఆక్సిజన్‌ సరిగా అందదు. రక్తహీనత తీవ్రతను బట్టి.. నిస్సత్తువ, పనులు చేస్తున్నప్పుడు శ్వాస కష్టంగా ఉండటం, మగతగా అనిపించటం, తలనొప్పి, నిద్ర పట్టకపోవటం, చర్మం పాలిపోవటం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఆకలి తగ్గటం, గుండె సరిగా కొట్టుకోకపోవటం వంటివీ ఉండొచ్చు. కాబట్టి రక్తహీనత బారిన పడకుండా ముందే జాగ్రత్త పడటం ఎంతో ఉత్తమం. అందుకు ఆహరంలో తగు మార్పులు చేసుకుంటే సరి.

* ఇనుముతో నిండిన యాపిళ్లు, అరటిపండ్లు, ఆకుకూరల వంటివి ఎక్కువగా తినాలి. మాంసం, ముడిధాన్యాలు కూడా మంచివే.

* సి విటమిన్‌ ఇనుమును ఎక్కువగా గ్రహించుకునేలా చేస్తుంది. అందువల్ల బత్తాయి, నిమ్మ, ఉసిరి వంటి సి విటమిన్‌ గల పదార్థాలు, పానీయాలు కూడా అధికంగా తీసుకోవాలి.

* భోజనం చేసిన వెంటనే కాఫీ, టీలు తాగటం మానెయ్యాలి. ఇవి ఇనుమును గ్రహించుకోకుండా అడ్డుకుంటాయి. ఫోలిక్‌యాసిడ్‌, విటమిన్‌ బి12తో నిండిన పాలకూర వంటి ఆకుకూరలు, కాలేయం, ముడిధాన్యాలు తగినంత మోతాదులో ఉండేలా చూసుకోవాలి. కిస్‌మిస్‌ వంటి ఎండు ఫలాల్లోనూ ఇనుము ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వీటిని కూడా ఆహారంలో విధిగా చేర్చుకోవాలి.





మన ఆరోగ్యాన్ని మనమే కాపాడు కోవాలి. ఎవరో వస్తారు ఏవోచేస్తారు ... అన్నింటికీ దేవుడే ఉన్నాడులే అని అనుకోకూడదు. -- డా.శేషగిరిరావు (శ్రీకాకుళం).
  • ==============================
Visit my website - > Dr.Seshagirirao.com/

No comments:

Post a Comment

Your comment is very important to improve the Web blog.