Thursday, April 7, 2011

రాస్ట్రం లో మానసిక సమస్యలు , Mental problems in A.P state



ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జాబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -ఆంధ్రప్రదేశ్ లో మానసిక సమస్యలు - గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...

రెండు శాతం మందిలో అత్యంత తీవ్రం,రుగ్మతకు ప్రాధాన్యమివ్వాలని కేంద్రం నిర్ణయం.3 వైద్యశాలల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం యోచన

దశాబ్ద కాలంలో జీవనశైలిలో వచ్చిన వివిధ మార్పులు వ్యక్తుల మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. నేడు ఎంతో మంది ఏదో ఒకరకమైన ఒత్తిడికి లోనవుతున్నారు. రాష్ట్రంలో దాదాపు 12 శాతం మందికి మానసిక సమస్యలు ఉన్నాయి. వీరిలో రెండు శాతం మందికి అతి తీవ్రంగా, మరో అయిదు శాతం మందికి తీవ్రంగా, ఇంకో అయిదు శాతం మందికి ఒక మోస్తరుగా ఉన్నాయి. వీరంతా సకాలంలో చికిత్స తీసుకుంటే సమస్యను పరిష్కరించడం సులభమేనని వైద్యనిపుణులు చెబుతున్నారు. సాధారణ వ్యాధులతో పోలిస్తే మానసిక సమస్యల పెరుగుదల ఎక్కువగా ఉందని పేర్కొంటున్నారు. మానసిక రుగ్మతలు పెరుగుతుండటంతో కేంద్ర ఆరోగ్య శాఖ ఈ సమస్యకు ప్రాధాన్యమివ్వాలని నిర్ణయించింది. దీనిపై అన్ని రాష్ట్రాల వైద్య,ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులతో ఇటీవల జాతీయస్థాయి సమావేశాన్ని నిర్వహించింది. భవిష్యత్తులో మిగిలిన జబ్బులతో పోలిస్తే మానసిక రుగ్మతలు ప్రథమ స్థానం ఆక్రమిస్తాయని భేటీలో నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. సమస్యను అధిగమించడానికి ప్రత్యేక కార్యచరణ సిద్ధం చేసుకోవాల్సి ఉందన్నారు. ఈ నేపథ్యంలో, మానసిక సమస్యల చికిత్సకు ఇప్పుడు ఉన్న నిబంధనలను పూర్తిగా మార్చాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వం ఒక ముసాయిదా బిల్లును రూపొందించినట్లు హైదరాబాద్‌లోని మానసిక వైద్యశాల సూపరింటెండెంట్‌ డాక్టర్‌ వి.ప్రమోద్‌ కుమార్‌ 'న్యూస్‌టుడే'తో చెప్పారు.

జిల్లా ఆస్పత్రుల్లో నియామకాలు
సమస్య తీవ్రతను దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం కూడా కొన్ని చర్యలు చేపట్టాలని భావిస్తోంది. హైదరాబాద్‌, విశాఖపట్నంలో ఉన్న మానసిక వైద్యశాలలకు అదనంగా మరో మూడు ప్రత్యేక ఆస్పత్రులు స్థాపించే అంశాన్ని పరిశీలిస్తోంది. జిల్లా ఆస్పత్రికి ఒకరు చొప్పున మానసిక వైద్యనిపుణులను నియమించాలని యోచిస్తోంది. ప్రతి 100 పడకల వైద్యశాలలో ఒక మానసిక వైద్యుడిని నియమించాలని రాష్ట్ర వైద్య,ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు కొద్ది రోజుల క్రితం ఒక ఉన్నతస్థాయి భేటీలో నిర్ణయించారు.

ఉన్నతస్థాయి భేటీ సిఫార్సులు
* సాధారణ వైద్యసేవల స్థాయిలో మానసిక సమస్యలకు ప్రాధాన్యం ఇవ్వాలి.
* మానసిక రుగ్మతలు ఉన్నవారి పట్ల వివక్ష చూపకూడదు.
* తీవ్రమైన మానసిక రుగ్మతలున్న వారికి ఉచితంగా మందులు ఇవ్వాలి.
* మానసిక సమస్యలపై ప్రత్యేక నర్సింగ్‌ డిప్లొమా కోర్సు ప్రారంభించాలి.
* నేరచరిత్ర ఉన్నవారు శిక్ష నుంచి తప్పించుకోవడానికి 'మానసిక రుగ్మత'ను ఒక అవకాశంగా వాడుకోకుండా వైద్యులు జాగ్రత్తలు తీసుకోవాలి.
* మానసిక స్థితి బాగాలేదని ఆస్పత్రుల్లో చేరే ముందు తమపై ఎలాంటి కేసులు లేవని రోగులు రాతపూర్వకంగా ధ్రువీకరించాలి. లేదా వారి సంబంధీకులు ధ్రువీకరణ ఇవ్వాలి.
* ప్రైవేటు ఆస్పత్రుల్లో మానసిక సమస్యలకు చికిత్స నిర్వహించడానికి వైద్య, ఆరోగ్యశాఖ నుంచి ప్రత్యేక గుర్తింపు తీసుకోవాలి.
* మానసిక వైద్యుల ప్రతిభను నిర్ణయించడానికి నిపుణుల కమిటీ సాయంతో ప్రత్యేక గ్రేడింగ్‌తో కూడిన గుర్తింపును ఇచ్చే విధానాన్ని అమలు చేయాలి.

మూలము : హైదరాబాద్‌ - న్యూస్‌టుడే
  • ================================================
Visit my website - -> Dr.Seshagirirao.com/

No comments:

Post a Comment

Your comment is very important to improve the Web blog.