Sunday, February 13, 2011

ఎండాకాలము లో జాగ్రత్తలు ,Precautions in Summer



ఆరోగ్యమే మహాభాగ్యము. మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జాబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -వేసవిలో జాగ్రత్తలు- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...


వేసవిలో జాగ్రత్తలు-వేసవిని కూల్‌ కూల్‌గా గడపండి----ప్రతి సీజన్‌కూ ఒక ప్రత్యేకత వుంటుంది. సమ్మర్‌ సీజన్‌ (వేసవి) కి అయితే, ప్రత్యేకతలెన్నో వున్నాయి. అలాగే వేసవిలో తీసుకోవలసిన జాగ్రత్తలూ ఎన్నో రకాలు. ఏ మాత్రం అజాగ్రత్తగా వున్నా సమ్మర్‌ ప్రభావంతో ఢమాల్‌ అవ్వాల్సిందే వేసవి ముగిసేవరకూ ప్రతి ఒక్కరూ, ప్రతి అంశంలోనూ అప్రమత్తంగా ఉండాల్సిందే! ఇది తప్పదు. ఉదయం లేచింది మొదలు, తీసుకునే ఆహారంలో త్రాగే నీటిలో పానీయాలలో ధరించే దుస్తులలో ఇక బయటకు వెళ్లినపుడు తగిన జాగ్రత్తలెన్నో తీసుకోక తప్పదు. మనిషి తినకా తప్పదు, తిరగకా తప్పదు కాబట్టి ఈ రెంటిలో వేసవిలో తగిన జాగ్రత్తలు తీసుకోవడం తప్పదు.

ఆహారపానీయాల విషయంలో జాగ్రత్త పాటించడం పట్ల సరైన అవగాహన లేకపోబట్టే, చాలామంది నిర్లక్ష్యం చేస్తుంటారు. వేసవిలో ముఖ్యంగా పిల్లల విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. నిర్లక్ష్యంగా ఉంటే వీరు ఏ రోజు, ఏ నిమిషంలోనైనా వేసవి తాపానికి చిక్కి డీలా పడిపోతారు. అలాగే వృద్ధుల విషయంలోనూ. నీడ పట్టున వుండే వారికి, ముఖ్యంగా గృహిణుల మీద సమ్మర్‌ ప్రభావం కనిపించదు కాని, బయట ఎక్కువగా తిరిగేవారికి, ఉద్యోగులు, వ్యాపారులు, విద్యార్థులు, కర్షకులు, కార్మికులు, ఇలా మూడొంతుల శాతం జనాలు వేసవి తాపం బారిన పడకతప్పదు. వేసవి ఉద్ధృతి ఎంత ఎక్కువగా ఉన్నా ఎవరికి వారు తగిన జాగ్రత్త సూత్రాలు పాటిస్తే వేసవి సైతం కూల్‌.. కూల్‌..గా సాగిపోతుంది. బయట తిరిగే వారందరూ తలపై ఆచ్ఛాదనగా, టోపీ గాని, గొడుగు, తలపాగా వంటివి సిద్ధం చేసుకుని, కళ్లకు నల్లద్దాల కళ్లజోళ్లు (కూలింగ్‌ గ్లాసెస్‌) పెట్టుకుంటే వేసవి ప్రతాపం ఫిఫ్టీ పర్సెంట్‌ తక్కువగానే అనిపిస్తుంది. ఎన్ని సాధనాలతో బయటకు వెళ్లినా తట్టుకోలేని వేడిమి వున్న సమయంలో అసలు తిరగడం తగ్గించడమే అసలైన జాగ్రత్త. ఉదయం 10, 11 గంటలలోపు సాయంత్రం, 4, 5 గంటల తరువాత పనులు చేసుకోవటానికి బయలుదేరితే, మంచిదంటున్నారు పెద్దలు.

వేసవిలో తాపం తగ్గడానికి అందరూ, ఎక్కువగా నీటినే త్రాగుతుంటారు. ఒక్క నీరే సరిపోదు. రకరకాల ద్రవపదార్థాలు, పానీయాలు తయారు చేసుకుని వినియోగించుకుంటే మంచిది. రోడ్ల మీద పెట్టే పదార్థాలు, పానీయాలు ఏ మాత్రం ఆరోగ్యంగా ఉండవు. చూడడానికి, పట్టుకోడానికి చల్లగా ఉంటాయి గాని, అవి అదే పనిగా స్వీకరిస్తే ఆరోగ్యం అంతే సంగతులు. ఐస్‌ క్రీములు, కోలా పానీయాలు, రసాయనపూరితాలు, అయినా అందరి దృష్టి ఎక్కువ వీటిపైనే వుంటుంది. స్లో పాయిజన్‌ లాంటి ఈ తరహా పదార్థాలు పానీయాలు, ఎక్కువగా తీసుకుంటే కోరి అనారోగ్యాన్ని కొని తెచ్చుకోవడమే అవుతుంది. కాలుష్యం లేని స్వచ్ఛమైన నీటిని ఎప్పుడూ దగ్గర వుంచుకోవాలి. ఆకలి తగ్గించుకోడానికి ఏది పడితే అది తినకూడదు. ఫాస్ట్‌ ఫుడ్‌, ఫ్రైస్‌ (వేపుళ్లు) అస్సలు దగ్గరకు రానివ్వకూడదు. ద్రవపదార్థాలకు ఎక్కువ ప్రాముఖ్యమివ్వాలి. ఇండ్లలో కూడా గృహిణులు వేసవి సీజన్‌లో వంటకాలలో మార్పులు చేసుకోవడం ముఖ్యం. వేసవి తాపానికి విరుగుడుగా, ఆరోగ్యాన్నిచ్చే వివిధరకాల పండ్ల రసాలు పానీయాలు చాలా తెలీక పద్ధతులలో తయారుచేసుకోవచ్చు. ఉదాహరణకు, పుదీనా, కొత్తిమీర రసాలు, పుచ్చకాయ, అల్లపురసం పానీయం, దానిమ్మ, ద్రాక్ష రసాలు, జ్యూస్‌లు, ఐస్‌ క్రీములు వంటివి కూడా ఇండ్లలోనే తయారు చేసుకుని తెలివైన నిర్వాకం, ఇక తాపం తగ్గించే కొబ్బరి నీళ్లు, శుభ్రంగా తయారు చేసిన చెరకురసం, తేలికగా లభిస్తాయి వేసవిలో తాత్కాలికంగా తాపం తగ్గించడంలో దృష్టి సారించడం కన్నా, ఆరోగ్యపరంగా వొంటిలో వేడి పెరగకుండా చూసుకోవడం ముఖ్యం. వేసవిలో వాతావరణంలో వేడి ఎక్కువగా వుంటుంది కాబట్టి, శరీరంలో నీటి శాతం త్వరగా తరిగిపోతుంటుంది. దీని వల్ల కండరాలు శక్తిహీనమౌతాయి. నీరసం, నిస్సత్తువగా అయిపోతుంటారు. అందువల్ల ఆహారాలలో చలువ చేసే పదార్థాలను ఎక్కువగా ఉపయోగించాలి. రాగి జావ (మాల్ట్‌) వేసవి తాపానికి విరుగుడు. పుదీనా, జీలకర్ర, సబ్జా, పుచ్చకాయ, కొబ్బరి పానీయాలు ఎక్కువ సేపు సేదతీర్చుతాయి. వేసవి రోజులన్నీ వీటితో గడిపితే, ఎంత వేడైనా ఇంతే కదా! అనిపిస్తుంది.

దుస్తులూ ప్రత్యేకమే...

వేసవిలో దుస్తులు ధరించడం కూడా ప్రత్యేకంగా వుండాలి. నూలు దుస్తులే వాడడం సరైంది. ఏ వయసువారైనా సరే, నూలు దుస్తులు వాడితే, వేసవి తాపం చాలా శాతం తగ్గిపోతుంది. పిల్లలకైతే నూలు దుస్తులు వేయడం తప్పదు కాక తప్పదు. ముదురురంగు, మందపాటి వస్త్రాలు, దుస్తులు దూరంగా వుంచడమే, అలాగే పాలియెస్టర్‌, సింథటిక్‌ అసలు వాడకూడదు లేత రంగులవి, తెల్లని కాటన్‌ దుస్తులే సరిగ్గా వేసవి వేడిని అడ్డుకునేవి.

వేసవిలో ఆరోగ్యపానీయాలు

పుచ్చకాయ రసంతో అల్లం మిళితం : పది కప్పుల పుచ్చకాయ గుజ్జు, కప్పు చెక్కు తీసిన అల్లం ముక్కలు మిక్సర్‌లో లేదా జ్యూస్‌ ఎక్స్‌ట్రాక్టర్‌లో వేసి రసం తీయాలి. చల్లదనం కోసం కొన్ని నిమిషాలు ఫ్రిజ్‌లో వుంచి త్రాగాలి.

ఈ రసం వల్ల, జీర్ణక్రియ ఉత్తేజం అవతుంది. రక్తవృద్ధితో, హెమోగ్లోబిన్‌ పెరుగుతుంది. కిడ్నీ, గుండెలకు మంచిది, తగిన నీటి శాతాన్ని కల్పిస్తుంది. అల్లం రసం వల్ల జీర్ణక్రియ సజావుగా ఉంటుంది. శ్వాససంబంధసమస్యలుండవు.

ద్రాక్ష, దానిమ్మలు

దానిమ్మ గింజలు కప్పు, రెండు కప్పులు ద్రాక్ష (గింజలు లేకుండా), చెంచా పంచదార మొత్తం మిక్స్‌ చేసి ఆ రసాన్ని వడకట్టి ఫ్రిజ్‌లో కొన్ని నిమిషాలు వుంచి సేవించాలి.

దానిమ్మ వల్ల అతిసారం, డయేరియా, ప్రేవులలో ఉన్న నులిపురుగులు పోతాయి. జీర్ణక్రియ చైతన్యంగా వుంటుంది. రోగనిరోధకశక్తి పెరుగుతుంది. కిడ్నీ, లివర్‌లు ఆరోగ్యంగా వుంటాయి. హెమోగ్లోబిన్‌ పెరుగుతుంది. గుండె జబ్బుల నివారణకు మంచి దోహదకారి.

రాగి మాల్డ్‌

మార్కెట్లో రాగి పిండి చౌకగా లభిస్తుంది. లేకుంటే రాగులను పిండి పట్టించి వుంచుకుని ప్రతి రోజూ మాల్డ్‌ (జావ) గా కాచి, వినియోగించుకోవచ్చు. కప్పు రాగి పిండి రెండు, మూడు కప్పుల నీరు కలిపి వేడి చేసి, దానిలో రెండు స్పూన్‌ల పంచదార, ఒక ఏలక్కాయ పొడి కలిపి, చల్లగాను, కొంచెం వేడిగానూ సేవించవచ్చు. రాగి మాల్డ్‌ను ప్రతి రోజూ సేవించడం వల్ల, శరీరానికి ధాతుపుష్టి కలగడమే కాక, శరీరంలోని అదనపు వేడిని హరిస్తుంది. వేసవిలో శరీరాన్ని చల్లగా హుషారుగా వుంచుతుంది.

వంటకాలు

వేసవిలో రోజువారీ వంటకాలు తయారుచేసుకోవడం ప్రత్యేకంగా ఉండాలి. శరీరానికి 'వేడి' నిచ్చే పదార్థాలు తగ్గించాలి. బీర, పొట్ల, దోస, సొర, ఆకుకూరలు, పప్పులు ఎక్కువగా వాడాలి. రసం, సాంబారు, సూప్‌లు ఒక పూట నియమంగా చేసుకుంటే మంచిది. దాని వల్ల ఆహారం సమతౌల్యంగా, చల్లగా ఉండి శరీరం తాపానికి దూరంగా ఉంటుంది.

అవును, ఎండ వేడిమి ఎంతగా వున్నా సమ్మర్‌లోనే టూర్‌లు, ట్రిప్పులు చేసేవారూ అధికంగా వుంటారు ఎందుకంటే పిల్లలకు పరీక్షలు ముగిసి వారు విశ్రాంతి పొందిన తరుణంలో వారికి కొంచెం గాలి మార్పు కోసం, ఎక్కడికైనా సరదాగా తీసుకువెళ్ళడం మంచిది. వేసవి సెలవుల కాలం పదునైన వేడిమితోవున్న అందరూ సరదాగా టూర్‌చేసి రావడానికి అదనైన కాలం కూడా. వేసవిలో టూరిస్టుల హడావిడి వున్నంతగా చలి, వాన కాలాలలో ఉండదు. కొంతమంది సెలవులకు స్వస్థలాలు, బంధుమిత్రులుండే ఊళ్లకు వెళ్లి, వారితో కొన్ని రోజులు గడిపి వస్తుంటారు. కొన్ని కుటుంబాలవారు సమ్మర్‌ టూర్‌ ప్యాకేజీలననుసరించి, ఉత్తర, దక్షిణ దేశయాత్రలూ చేసివస్తుంటారు. అంతగా హైరానా అనుకునేవారు. రాష్ట్రంలో పలు సందర్శనస్థలాలు, పుణ్యక్షేత్రాలకు వెళ్లి కొన్ని రోజులు గడిపి వస్తుంటారు. ఎవరు ఎక్కడికి వెళ్లినా ముందుగా టూర్‌ ప్లాన్‌ చేసుకోవాలి. ఎక్కడికి వెళ్లేది ఎన్ని ప్రదేశాలు, ఎన్ని రోజులు తిరిగేది ఎంతమంది ఏ విధంగా వెళ్లాలన్నది ముందుగానే ఒకటికి రెండుసార్లు సమీక్షించుకుని తగిన జాగ్రత్తలు తీసుకోవాలి టూర్‌కెళ్లే బృందంలో వృద్ధులూ, పిల్లల అనారోగ్యం ఉన్నవారు వుంటే చాలా అప్రమత్తంగా వుండాలి ముందుగానే వైద్యపరీక్షలు చేయించి డాక్టర్‌ సలహా ప్రకారం కొన్ని రకాల మందులు, ఆరోగ్యసాధనాలు సిద్ధం చేసుకోవాలి. మరీ అనారోగ్యంగా వున్నవారు, టూర్‌ జోలికి పోకపోవడమే మంచిది వేసవిలో వెళ్లే ప్రదేశాలు చల్లదనంతో ఉండేవి ఎంచుకుంటే మంచిది.

మన రాష్ట్రంలో దర్శనీయస్థలాలు, విహారకేంద్రాలు రాష్ట్రం నలుచెరుగులా వున్నాయి. ఉత్తరకోస్తా జిల్లాలైన, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలలో చాల చల్లని సేదతీరే స్థలాలే కాకుండా చారిత్రకపుణ్యక్షేత్రాలున్నాయి. శ్రీకాకుళం, విశాఖ జిల్లాలైతే సుందరసముద్రతీరాలలో సందర్శకులను అలరిస్తుంటాయి. విశాఖ జిల్లాలో వేసవి పర్యటన మంచి అనుభూతిని మిగిలిస్తుంది. ఇక దక్షిణాంధ్రలో చిత్తూరు జిల్లా ఎంత వేసవి అయిన శీతలపవనాలతో పచ్చని ప్రకృతి రమణీయంగా వుంటుంది. మదనపల్లి, హార్స్‌లీ హిల్స్‌, కాణిపాకం, తిరుమల, తిరుపతి ప్రదేశాలన్నీ వేసవి సాధారణకాలాలలోనూ అనునిత్యం విహరించే సుందరప్రదేశాలే కడప, కర్నూలు జిల్లాలలో పెక్కు దర్శనీయస్థలాలున్నాయి. అన్ని పుణ్యక్షేత్రాల నెలవులే మంత్రాలయం, అహోబిలం, మహానంది, శ్రీశైలం లేపాక్షి, గుంటుపల్లి గుహలు, బ్రహ్మంగారు తిరుగాడిన పుణ్యస్థలాలు, మఠాలు వంటివి సందర్శించడం వేసవిని మరిపింపచేస్తాయి.

మహానగరంలో మరెన్నో....

దూర, సుదూరప్రాంతాలకు వెళ్లే వీలులేకపోయినపుడు హైదరాబాద్‌ మెగానగరంలోనే పలు సందర్శనస్థలా

లను చుట్టిరావచ్చు. ఈ నాడు భాగ్యనగరంలో అన్ని ప్రాంతాలలోనూ మెగా పార్కులను అభివృద్ధి చేశారు, వాటర్‌ పార్క్‌లు, స్నో వరల్డ్‌ నగరం వెలుపల పచ్చని రిసార్ట్స్‌లు, అనునిత్యం సందర్శకులను ఆహ్వానిస్తుంటాయి. సమ్మర్‌లో దరిదాపులలో, దూరంగా ఎక్కడికైనా ట్రిప్‌ కొట్టి రాదలచేవారు ముందుగా ప్రణాళిక చేసుకుని అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుని, ఆందోళనలు, అనారోగ్యాలను దరిచేరనీయకుండా హాయిగా ఉషారుగా తిరిగివత్తుమా... అనవచ్చు.

వృద్ధులు, పిల్లలు... పెంపుడు జంతువుల పట్ల వేసవి జాగ్రత్తలు

వేసవిలో ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవడంతో వృద్ధులు, పిల్లలు పెంపుడు జంతువుల పట్ల జాగ్రత్తలుండాలి. వీరి శారీరకపరిస్థితి అతిసున్నితంగా వుంటుంది. వేసవిలో తాపం ఎక్కువగా ఉండి, త్వరగా అలసిపోతారు. పిల్లలూ పెంపుడు జంతువులు కూడా అంతే.

సహజంగా పెంపుడు జంతువులలో కుక్క, పిల్లి, ఎక్కువగా పెంచుకుంటారు. కొంతమంది పక్షులను పెంచుతుంటారు. పెంపుడు జంతువులు, పక్షులు, స్వేచ్ఛగా బయట తిరుగుతున్నప్పుడు వేడి, చలి, అనేవి మనిషి కన్నా వాటికే గ్రహింపు ఎక్కువగా ఉంటుంది. అవి ప్రాకృతికంగా తగిన జాగ్రత్తలు తీసుకుంటాయి. అయితే వాటిని మన ఇండ్లలో పెంచుకునేటప్పుడు మన పెంపకంలో వాటి సహజస్థితిని కోల్పోయి వుంటాయి. మనపై ఆధారపడతాయి గనుక వాటిని చాలా సున్నితంగా చూడాలి చల్లని వాతావరణంలో వుంచాలి అవి నివాసం ఉండే బోనులు వగైరా మరీ చీకటిలో వుంచకుండా నీడగా ఉండే ప్రదేశంలో ఆక్సిజన్‌ బాగా అందేటట్లూ ఉంచాలి. నిత్యం త్రాగు నీరు, టైం ప్రకారం ఆహారం అందించడం సాయంత్రాలు చల్లని గాలిలో తిప్పడం చెయ్యాలి పెంపుడు జంతువులకు ప్రత్యేకమైన పడక, వస్తువులు తిండి పెట్టే బౌల్స్‌ నీరు త్రాగేవి అన్ని లభిస్తాయి. వేసవి వేడిమికి అవి ఏమన్నా అనారోగ్యం పాలైతే వెంటనే వెటర్నరీ డాక్టర్‌కి చూపించి తగిన సూచనలు పొందాలి.

  • ====================================
Visit my website - > Dr.Seshagirirao.com/

No comments:

Post a Comment

Your comment is very important to improve the Web blog.