Monday, February 21, 2011

Peptic ulcer , పెప్టిక్ అల్సర్


ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జాబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -Peptic ulcer , పెప్టిక్ అల్సర్- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే, మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...

అన్న వాహిక కింది భాగంలో, జీర్ణాశయంలో, డ్యుయోడినమ్‌లో ఏర్పడే పుండునే పెప్టిక్‌ అల్సర్‌ అంటారు. పెప్టిక్‌ అల్సర్‌ జీర్ణాశయంలో ఏర్పడితే గ్యాస్ట్రిక్‌ అల్సర్‌ అని, డుయోడినమ్‌లో ఏర్పడితే డుయోడినల్‌ అల్సర్‌ అని అంటారు. జీర్ణాశయం బయట ద్వారం నుండి మొదలయ్యే చిన్న పేగు ఆరంభమయ్యే భాగాన్ని డుయోడినమ్‌ అంటారు. అన్నవాహిక (Oesophagus)చివరిలో ఏర్పడితే ఈసోపేజియల్ అల్సర్ అని అంటారు . మనం తీసుకునే ఆహారంలో, అలవాట్లలో మార్పులు చేసుకుంటే పెప్టిక్‌ అల్సర్‌ను నివారించొచ్చు.

కారణాలు

*వంశపారంపర్యంలో ఒక రకమైన జన్యువుల వల్ల.

*పొగతాగే వారిలో అవకాశం అధికం.

*గాస్ట్రినోమ అనే క్లోమగ్రంథిలో పెరిగే గడ్డ వల్ల.

*కొంతమందిలో గ్యాస్ట్రోజెజునాష్టమి ఆపరేషన్‌ చేసిన తర్వాత ఏర్పడొచ్చు.

*ఎక్కువ ఆందోళన చెందేవారిలో.

*మద్యం అపరిమితంగా సేవించేవారిలో.

*ఎక్కువ కారం, పులుపు, మసాల దినుసులు వాడే వారిలో.

*జీర్ణాశయంలో ఎక్కువ యాసిడ్‌ తయారవటం వల్ల.

*'హెచ్‌.పైలోరి' అనే సూక్ష్మజీవులవల్ల.

వొళ్లు నొప్పులు తగ్గించే (పెయిన్‌కిల్లర్స్‌) కొన్ని మందుల వల్ల.ఈ పెప్టిక్‌ అల్సర్‌ ఏర్పడుతాయి.

ఎలా మొదలవుతుంది ?

*జీర్ణాశయంలో ఎక్కువ జీర్ణరసం ఉత్పత్తి.

*జీర్ణాశయం లోపలి వుండే పల్చటి పొర (గ్యాస్ట్రిక్‌ మ్యూకోజ) దెబ్బతిన్నప్పుడు (మద్యం అతిగా సేవించే వారిలో ఆస్పిరిన్‌ మొదలైన మందులు *వాడేవారిలో ఆ పొర దెబ్బ తింటుంది.)

*పెస్సిన్‌ ఆమ్లం ఎక్కువ ఉత్పత్తి అయి గ్యాస్ట్రిక్‌ మ్యూకోజా దెబ్బతిన్నప్పుడు.

*చర్మం కాలినప్పుడు, కొన్ని రక్త ప్రసరణ రోగాలు వచ్చినప్పుడు.

వ్యాధి లక్షణాలు

జీర్ణాశయం అల్సర్‌ : బాగామంటతో కూడిన నొప్పి. అన్నం తింటూనే ఎక్కువై, 3,4 గంటల తర్వాత తగ్గుతుంది. అన్నం సహించకపోవడం. ఆకలి మందగించడం. వాంతుల వడం. బరువు తగ్గడం. వాంతి అయితే నొప్పి తగ్గడం. ఇవి దీని సాధారణ లక్షణాలు. జీర్ణాశయంలో రక్తస్రావం జరిగితే, కాఫీ, డికాక్షన్‌ లాగ వాంతులవడం, మనిషి నీరసిం చిపోవడం జరుగుతుంది. ఇది అత్యవసర పరిస్థితి.

డ్యుయోడినల్‌ అల్సర్‌ : కడుపు పైభాగంలో మంటతో కూడిన నొప్పి. ఖాళీ కడుపు వున్నప్పుడు నొప్పి అధికమవుతుంది. అన్నం తిన్న రెండు, మూడు గంటలు దాటిన తర్వాత, అర్థరాత్రి, తెల్లవారు జామున అధికనొప్పి రావడం. అప్పుడేమైన తిని నీళ్లు తాగితే తగ్గుతుంది. ఇవి ముఖ్య లక్షణాలు. దీని లోపల, పుండు నుండి రక్తస్రావం జరిగితే వాంతితో పాటు, తారులాగా నల్లగా విరేచనమవుతుంది. ఇది అత్యవసర పరిస్థితి.

విపరీతలక్షణాలు : అల్సర్‌ నుండి రక్తస్రావం అవుతుంది. గ్యాస్ట్రిక్‌ అవుట్‌లెట్‌ అవరోధం. పుండు వున్న చోట రంధ్రం పడడం. పైలోరిక్‌ స్టినోసిస్‌ ఏర్పడడం. పుండు క్యాన్సర్‌గా మారటం.

వ్యాధి నిర్ధారణ

జిఐ ఎండోస్కోపి, బేరియం ఎక్సరే, రాపిడ్‌ బయాప్సి‌ (హెచ్‌.పైలోరి కనుక్కోవడానికి)

శస్త్ర చికిత్స

హెచ్‌.పైలోరి వున్నవాళ్లు డాక్టరు సలహామేరకు సరైన మందులు వాడాలి. కొందరిలో పైలోరిక్‌ స్టినోసిస్‌ వుంటే ఆపరేషన్‌ (గ్యాస్ట్రోజెజునాస్టమి) చేయాల్సి ఉంటుంది. పుండు రంధ్రంగా ఏర్పడతే దానికి వెంటనే తగిన శస్త్రచికిత్స చేయాల్సి వుంటుంది. పుండు నుండి అధిక రక్తస్రావం జరిగిన పక్షంలో కూడా మందులతో ఉపశమనం లేకపోతే శస్త్ర చికిత్స అవసరం వుంటుంది.

డాక్టరు పర్యవేక్షణలో తగిన సమయంలోమందులు వాడితే అల్సర్‌ మానిపోతుంది. ఇప్పుడు అల్సర్‌ నయమవడానికి మంచి మందులు అందుబాటులో వున్నాయి.

ముఖ్యముగా వాడే కొన్ని మందులు :
  • omeperazole ,
  • Esomiperazole ,
  • pentaprazole ,
  • Rabeprazole

నివారణ ఇలా

రోజు వారి ఆహారంలో పులుపు, కారం, మసాలా తగ్గించాలి.

*ధూమపానం, మద్యం, పొగాకు నమలడం మానాలి.

*మనసును ప్రశాంతంగా వుంచాలి.

*రోజుకు 6 నుంచి 8 గంటలు కలతలులేని నిద్రపోవాలి.

*ఆస్పిరిన్‌, ఇతర నొప్పి నివారణ మందులు అవసరమైతేనే డాక్టర్‌ సలహా ప్రకారం మాత్రమే వాడాలి.

*కాఫీ, టీలు, చాక్లెట్‌లు తగ్గించాలి.

*మూడు, నాల్గు గంటలకోసారి ఏదైనా ఆహారం తీసుకోవాలి.

మజ్జిగ, పాలు తాగుతుండాలి.

*బేకరి పదార్థాలు, నూనెలో వేయించినవి మానాలి.


పెప్టిక్‌ అల్సర్‌ వల్ల కలిగే అత్యవసర ప్రమాద చికిత్స :

-అత్యవసరంగా చికిత్స చేయాల్సిన కడుపు నొప్పులలో ప్రధానంగా పేర్కొనవలసింది కడుపులో పుండు (పెప్టిక్‌ అల్సర్‌), దాని వలన కలిగే విపత్కర పరిణామాలు. సాధారణంగా ఈ రోజుల్లో ఎవరిని కదిలించినా 'నాకు గ్యాస్‌ ట్రబుల్‌ ఉంది అని చెబుతుంటారు. అల్సర్లు జీర్ణాశయంలో కాని, డుయోడినమ్‌లో కాని మొదలవుతాయి.

కారణాలు
అల్సర్‌ అనేది మధ్య వయస్సులోని పురుషుల్లో అధికంగా కనిపిస్తుంది. అయితే ఏ వయస్సులో నైనా, స్త్రీలలో కూడా ఇది వచ్చే అవకాశాలున్నాయి. మద్యపానానికి బానిసలైన వారిలోనూ, ఆహారాన్ని తీసుకో వడానికి సరైన వేళలు పాటించని వారిలోనూ, మసాలాలతో కూడిన ఆహార పదార్థాలు అధికంగా తీసుకునేవారిలోనూ ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది.
అందుకనే డాక్టర్లు మద్యపానానికి, మసాలా తిండికి దూరంగా ఉండాలని ఈ సమస్యతో బాధపడే రోగులకు సలహా ఇస్తుంటారు. ఎండోస్కోపీ అనే పరికరం ద్వారా అల్సర్‌ వ్యాధిని నిర్ధారిస్తారు.

అల్సర్ల వలన కలిగే దీర్ఘకాలిక సమస్యలను పక్కన పెడితే, దీనివలన కలిగే అత్యవసర విపత్కర (ఎమర్జెన్సీ) సమస్యల గురించి తెలుసుకుందాం.
ఎమర్జెన్సీ సమస్యలలో పుండు పగిలి జీర్ణాశయంలో రంధ్రం పడటం (పర్ఫొరేషన్‌) మొదటిది. పుండు రక్తనాళాల లోకి చొచ్చుకునిపోయి రక్తస్రావం కావడం రెండవది.

రంధ్రం పడటం
ఈ సమస్య ఎదురైనప్పుడు అత్యవసరంగా శస్త్ర చికిత్స కొన్ని గంటలలోనే చేయాల్సిఉంటుంది. లేనిపక్షంలో రోగి ప్రాణాలు కోల్పోవచ్చు. ఈ సమస్యకు గురైన చాలా కేసుల్లో ప్రాణాపాయం సంభవిస్తుంటుంది.

లక్షణాలు
అల్సర్‌ కారణంగా కడుపులో రంధ్రం పడిన వ్యక్తికి విప రీతమైన కడుపునొప్పి బొడ్డు పైభాగంలో మొదలవుతుంది. ఇది క్రమంగా కడుపులోని ఇతర భాగాలకు ప్రాకుతుంది.
దీనిలో నాడి తీవ్రత అధికమవుతుంది. రక్తపోటు తగ్గు తుంది. వాంతులు కూడా అధికంగా ఉంటాయి. ఇన్‌ఫెక్షన్‌ కడుపు భాగమంతా వ్యాపించడం వలన కొద్ది గంటల వ్యవధిలోనే రోగి మరణానికి చేరువ అయ్యే అవకాశాలు అధికంగా ఉంటాయి. ఈ దశ రాకముందే రోగికి ఎక్స్‌రే అబ్డామిన్‌, స్కానింగ్‌ వంటి పరీక్షలు చేసి వ్యాధి నిర్ధారణ చేసి చికిత్స ప్రారంభించాల్సి ఉంటుంది.
ఆపరేషన్‌ చేసే ముందు రోగిని ఆపరేషన్‌కు, మత్తుమందుకు తట్టుకునే విధంగా చేయాల్సి ఉంటుంది. దీనిని రిససిటేషన్‌ (Resuscitation) అంటారు.
ఆపరేషన్‌లో అల్సర్‌ వలన ఏర్పడిన రంధ్రాన్ని పూడ్చి వేస్తారు. తరువాత కడుపులో చేరిన చీమును తొలగించి, కడుపు మొత్తాన్ని సెలైన్‌తో శుభ్రపరుస్తారు.

శస్త్రచికిత్స తరవాత రోగి నెమ్మదిగా పది రోజులలో కోలు కోవడం జరుగుతుంది. అల్సర్‌ పూర్తిగా తగ్గడానికి మూడు నెలల తరువాత మరొక ఆపరేషన్‌ చేయాల్సి ఉంటుంది.
అల్సర్‌ కారణంగా కడుపులో రంధ్రం పడటమనేది పెప్టిక్‌ అల్సర్లవలన మాత్రమే కాకుండా, టైఫాయిడ్‌ జ్వరంతో బాధపడే వారిలోనూ కనిపిస్తుంది. దీనిని ఎంటరిక్‌ పర్ఫొరేషన్‌ అంటారు. ఈ అల్సర్‌ వలన పడే రంధ్రం కడుపులో కాకుండా, చిన్న ప్రేవుల్లో పడుతుంది.
టైఫాయిడ్‌ జ్వరంతో రోగి మూడు వారాలపాటు బాధపడిన తరువాత ఈ స్థితి సంభవి స్తుంది. ఇది పెప్టిక్‌ అల్సర్‌ కంటే ప్రమాదకరమైనది. దీనిలో మరణాల రేటు చాలా అధికంగా ఉంటుంది. దీనిని కూడా ఆపరేషన్‌ ద్వారా మాత్రమే సరి చేయాల్సి ఉంటుంది.

రక్తస్రావం
పెప్టిక్‌ అల్సర్‌ ఏదైనా రక్తనాళంలోకి చొచ్చుకొని పోతే ఈ పరిస్థితి ఏర్పడుతుంది. దీనిలో రోగి విపరీతంగా రక్తాన్ని వాంతి చేసుకుంటాడు. ఫలితంగా షాక్‌కు గురవుతాడు. ఈ స్థితిని కూడా ఎండోస్కోపీ ద్వారా నిర్ధారించి, మందులతో నయం చేయాల్సి ఉంటుంది. ఒక్కొక్కసారి ఆపరేషన్‌ అవ సరమవుతుంది.

నివారణ
ఎప్పుడైనా సరే చికిత్స కంటే నివారణే గొప్పది. కనుక అసలు అల్సర్లు రాకుండా జాగ్రత్తలు తీసు కోవాలి.దీనికోసం ఈ కింది సూచనలు పాటించాలి.
- సరైన సమయంలో భోజనం చేయడం
- మసాలాలు, వేపుడు పదార్థాలను తక్కువగా తినడం,
- సిగరెట్లు, మద్యం మొదలైన వాటికి దూరంగా ఉండటం,
- నొప్పిని తగ్గించే మాత్రలు వేసుకోవాల్సి వస్తే వాటిని భోజనం తరువాత మాత్రమే వాడటం.
పైన పేర్కొన్న చిన్నపాటి జాగ్రత్తలను పాటించిన ట్లయితే అల్సర్లు సోకే పరిస్థితిని నివారించవచ్చు.
  • =================================
Visit my website - > Dr.Seshagirirao.com/

No comments:

Post a Comment

Your comment is very important to improve the Web blog.