Thursday, October 28, 2010

గుండెజబ్బులు , Heart diseases



మానవ దేహంలోని గుండె

మీకు సుపరిచితమైన లబ్ డబ్ శబ్దం సిరలు(veins)నుంచి గుండెకు మరియు ఊపిరితిత్తులకు రక్తాన్ని సరఫరా చేసే పనిలో మీ గుండె నిమగ్నమై ఉందని సూచిస్తుంది, అలా సరఫరా కాబడిన రక్తాన్ని ఆమ్లజనితో శుద్ధి చేసిన అనంతరం ధమనులు(arteries)ద్వారా శరీరానికి తిరిగి పంపిణీ చేస్తుంది.

గుండె ఎలా పని చేస్తుంది?
మానవ దేహంలోని గుండె అచ్చమైన పంపులాంటిది, మీ పిడికిలి పరిమాణంలో ఉండే గుండె శరీరంలోని మిలియన్ల సంఖ్యలో గల కణాల నుంచి రక్తాన్ని పంపిణీ మరియు స్వీకరించే కార్యకలాపాలను చేపడుతుంది. ఇది నాలుగు గదులుగా నిర్మితమై ఉంటుంది. చెరోవైపు గల రెండు గదులను పటిగా పిలవబడే గోడ కుడివైపును ఎడమవైపును విభజిస్తుంది.

ఈ రెండు స్వీకరించే గదులు కవాటములుగా(valves) పిలువబడే రెండు మార్గాలను కలిగి ఉంటాయి. గుండెకు చెరోవైపున ఉండే రెండు కవాటాలు గుండె ద్వారా రక్తం ప్రవహించేందుకు సహకరిస్తాయి. కుడివైపున గల త్రిపత్ర కవాటము(Tricuspid valve)మరియు ఎడమవైపున గల ద్విపత్రకవాటము(Mitral valve)చెరోవైపున కర్ణిక(Atrium)మరియు జఠరిక(Ventricle) మధ్య రక్త ప్రసారాన్ని నియంత్రిస్తాయి.

ఊపిరితిత్తులకు రక్తాన్ని సరఫరా చేసేందుకు ఉద్దేశించిన పుపుస కవాటముగా(Pulmonary valve) పిలవబడే కుడి కవాటము కుడి జఠరిక నుంచి పుపుస ధమనులకు రక్త ప్రసరణను అనుమతిస్తుంది. బృహద్ధమన కవాటముగా(Aorta valve)పిలవబడే ఎడమ కవాటము, ఎడమ జఠరిక నుంచి బృహద్ధమనికి(Aorta) రక్త ప్రసరణను నియంత్రిస్తుంది.

ఆరోగ్యవంతమైన దేహంలో నిరంతరాయంగా ప్రవహించే దిశగా ఐదు లీటర్ల రక్తాన్ని గుండె పంపు చేస్తుంది. గుండె నుంచి బయలుదేరిన రక్తం ధమనులుగా పిలవబడే నాళాల ద్వారా కేశనాళికలుగా(capillaries) పిలవబడే రక్త నాళములలో అతి సూక్ష్మమైన నాళికల ద్వారా ప్రవహించి చివరకు గుండెకు చేరవేసే సిరలలోకి ప్రవేశిస్తుంది.

ఈ కార్య చక్రం 60 సెకండ్లలో పూర్తి అవుతుంది, అదే సమయంలో దేహం యొక్క కణాలలోని ధాతువులు, అంగాలు, కండరాలు మరియు ఎముకలకు ఆమ్లజనితో పాటు బలవర్థకాన్ని రక్తం అందిస్తుంది.


గుండెజబ్బులు

గుండెజబ్బులు రావటానికి ప్రధాన కారణాలు చాలానే ఉన్నాయి. మధుమేహం, రక్తపోటు, పొగత్రాగటం, అధిక కొవ్వు, అధిక బరువు, ఒత్తిడి, వ్యాయామం చేయకపోవటం వంటి కారణాలు ప్రధానమైనవి. ఇదివరకు పురుషులు మాత్రమే ఎక్కువగా గుండె జబ్బులకు గురయ్యేవారు. అయితే ఇప్పుడు మహిళలలో కూడా గుండె జబ్బులు ఎక్కువగా కనిపిస్తున్నాయి.సహజంగా చిన్నపిల్లల్లో తలెత్తే హృదయ సంబంధిత వ్యాధులు వంశపారంపర్యంగా సంక్రమించేవిగా ఉంటున్నాయి. అదేవిధంగా పుట్టుకతో వచ్చే వ్యాధులు కూడా ఉంటున్నాయి. గుండెజబ్బులు తలెత్తే వారిలో కేవలం 20 శాతం మందికి మాత్రమే శస్త్ర చికిత్సలు అవసరమవుతాయి. నిజానికి గుండె జబ్బు ఉన్నట్లు ముందుగా గుర్తించినట్లయితే మందులతోనే వ్యాధిని నయం చేయవచ్చు. అయితే కొందరు వ్యాధిని గుర్తించినప్పటికీ సత్వర చికిత్సను అశ్రద్ధ చేస్తారు. ఫలితంగా మందులతో నయమయ్యే వ్యాధి కాస్తా శస్త్ర చికిత్సకు దారి తీస్తుంది. నిపుణులైన వైద్యులు ఒకసారి వ్యాధి పరిస్థితిని వివరించిన తర్వాత దానికి తగ్గట్లుగా స్పందిస్తే రోగి ప్రాణాలను కాపాడినవారవుతారు.

లక్షణాలు
ఉదర సంబంధిత నొప్పి రావటం, అసాధారణమైన నాడీ స్పందన, గుండెపోటు, ఆయాసం, ఆకలి మందగించటం, శ్వాస సంబంధిత సమస్యలు తలెత్తటం, ఛాతీ నొప్పి, చర్మం నీలి వర్ణంలోకి మారటం, మానసిక వ్యాకులత, కళ్లు తిరగటం, శ్వాసావరోధం, వంటికి నీరు చేరటం, మూర్చిల్లటం, వేగమైన హృదయ స్పందన, జ్వరం, దగ్గుతోపాటు రక్తం పడటం, కండరాలు బిగుతుగా మారటం, బరువు పెరగటం, బరువు తగ్గటం వంటివి వాటిని మనం హృదయ సంబంధిత సమస్యలకు సంబంధించి లక్షణాలుగా చెప్పుకోవచ్చు.

జాగ్రత్తలు
ధూమపానం అలవాటును మానుకోవాలి. ప్రతి రోజూ అర గంటసేపు నడక అలవాటును తప్పక పాటించాలి. రక్తపోటు మరియు మధుమేహాన్ని నియంత్రణలో ఉంచుకోవాలి. టెన్షన్‌ను విడనాడాలి. ఎల్లప్పుడూ సమతుల ఆహారాన్ని తీసుకోవాలి. ఆశావహ దృక్పథాన్ని అలవరుచుకోవాలి.

ఆహారాన్ని
ప్రధానంగా అధికంగా నూనెల వాడటాన్ని తగ్గించుకోవాలి. దీంతోపాటు తాజా పండ్లను, కూరగాయలను తీసుకుంటుండాలి.

క్లిష్టమైన శస్త్ర చికిత్సలు
పుట్టుకతో వచ్చే గుండె సంబంధిత వ్యాధులు, గుండెకు కొవ్వు చేరటం, హార్ట్ ఫెయిల్యూర్ విషయంలో శస్త్ర చికిత్సలు క్లిష్టతరంగా ఉంటాయి.

Updates : Heat diseases ->

ఐక్యూ (తెలివితేటలు) తక్కువగా వున్న వ్యక్తులకు సగటున గుండెజబ్బులు వచ్చే అవకాశాలు ఎక్కువగా వున్నాయని ఇటీవల ఒక సర్వేలో పరిశోధకులు నిర్ధారించారు. దాదాపు నాలుగు వేల మందిపై నిర్వహించిన ఈ సర్వే వివరాలను యూరోపియన్‌ హార్ట్‌ జర్నల్‌ తాజా సంచికలో ప్రచురించారు. ఇందులో ఉన్నత, దిగువ స్థాయి సామాజిక, ఆర్థిక వర్గాలలో మరణాల వ్యత్యాసం దాదాపు 20 శాతానికి పైగా వుందని వీరు నిర్ధారించారు. సామాజిక, ఆర్థిక వెనుకబాటు తనానికి గురైన వర్గాల వారు గుండెజబ్బులు, క్యాన్సర్‌, ప్రమాదాల వంటి వాటితో త్వరగా మరణించేందుకు అవకాశం వున్నట్లు తమకు తెలుసని ఈ సర్వే బృందానికి నేతృత్వం వహించిన డా.డేవిట్‌ బట్టి చెప్పారు. వాతావరణ పరిస్థితుల ప్రభావం, ధూమపానం, భోజనం, భౌతిక కార్యకలాపాల వంటి ఆరోగ్యపరమైన ప్రవర్తన వంటి అంశాలు ఈ వ్యత్యాసానికి కారణాలని, అయితే ఇందులో అన్నీ ఇందుకు కారణం కాబోవని వివరించారు. తెలివితేటల పెరుగుదలకు దోహదపడే అంచనాకు అందని మానసిక కారణాల వల్ల గుండెజబ్బుల పెరుగుదలకు అవకాశం వుందని ఆయన వివరించారు.

విటమిన్‌ బితో పక్షవాతం, గుండెజబ్బులు దూరం

ఆరోగ్యానికి 'బి విటమిన్లు చేసే మేలు గురించి అందరికీ తెలిసిందే అయితే మరోసారి ఈ 'బి విటమిన్లలోని ఫోలేట్‌, బి6 ఉన్న ఆహారాన్ని తీసుకుంటే పక్షవాతం, గుండెజబ్బుల వల్ల కలిగే మరణాల ముప్పు తగ్గుతుందని జపాన్‌ పరిశోధ కుల అధ్యయనంలో తేలింది.

జపాన్‌ కొలాబరేటివ్‌ కోహార్ట్‌ స్టడీలో భాగంగా 40-79 ఏళ్ళ మధ్యగల 23, 119 మంది పురుషులు, 35, 611 మంది మహిళల మీద అధ్యయనం చేశారు. వారి ఆహార అలవాట్లను నమోదు చేసుకుని, 14 సంవత్సరాల పాటు గమనించారు.

అనంతరం చనిపోయిన వారి వివరాలను సునిశితంగా పరిశీలించారు. వీరిలో ఫోలేట్‌, బి6 ఉండే ఆహారాన్ని ఎక్కువగా తీసుకున్న పురుషుల్లో గుండె వైఫల్యం కారణంగా వచ్చే మరణాలు తక్కువ సంఖ్యలో నమోదైనట్టు గుర్తించారు. అదే మహిళల్లో గుండెజబ్బులు, పక్షవాతం వల్ల కలిగే మరణాలు తక్కువగా ఉన్నాయి.

మనం తినే ఆహారంలో ముఖ్యంగా కూరగాయలు, పండ్లు, పొట్టుతీయని ధాన్యాలు, బీన్స్‌, ఆకుకూరల్లో ఫొలేట్‌ ఎక్కువగా ఉంటుంది. ఇక బి6 చేపలు, కాలేయం, ముడిధాన్యాల్లో ఎక్కువగా ఉంటుంది. ఇవేకాక నూనెలు తక్కువగా ఉన్న ఆహారం తీసుకుంటే పక్షవాతం, గుండె జబ్బులకు చెక్‌ చెప్పడమే కాకుండా ఆరోగ్యంగా జీవించవచ్చు. అంతేకాదు ఈ ఆహారాన్ని తీసుకోవడం శరీరానికి పీచుపదార్థం (ఫైబర్‌) ఎక్కువగా అందుతాయి. స్థూలకాయులు కూడా ఈ ఆహారాన్ని మితంగా తినడం వల్ల స్థూలకాయాన్ని తగ్గించుకోవ్ఞ్చ.

వయస్సుతోపాటు వచ్చే గుండెజబ్బులు
మన దేశంలోనూ, ప్రపంచవ్యాప్తంగానూ గుండె జబ్బుల శాతం రోజురోజుకూ అంచనాలను మించి పెరుగుతూనే ఉంది.
ఈ జబ్బులు పుట్టుకతోనూ, కౌమార, యవ్వన దశలల్లోనూ, ఇంకా వయస్సు మీద పడుతున్న వారిలోనూ వస్తూనే ఉన్నాయి. అయితే పుట్టుకతో వచ్చేవి, తరువాత దశల్లో అవి ఇంకా పెరిగి ప్రాణాం తకంగా మారుతున్నాయి.
ఈనాడు యుక్త వయస్కులు వారు చేసే ఉద్యోగ, జీవన విధానాలు, ఒత్తిడి, ఆహారపు అలవాట్లు, వ్యాయామం లేకపోవడం వంటివాటి వల్ల తరచుగా ఈ గుండెజబ్బులకు గురవుతున్నారు.

వయస్సు పెరిగిన కొద్దీ శరీరంలోని ధమనుల లోనూ, గుండెలోనూ అనేక మార్పులు సంభవిస్తాయి. ఇటీవల వరకూ ఈ మార్పులు వయస్స పెరగడం వల్లనే సంభవిస్తున్నాయని భావించేవారు.
అయితే ప్రస్తుతం లభిస్తున్న గణాంకాల ప్రకారం ఈ మార్పులు జీవన విధానం వల్ల కరొనరీ ధమనుల్లో పేరుకున్న పీచు, కొవ్వు పదార్థాల మిశ్రమం అని నిర్ధారిస్తున్నారు.

ఈ కరొనరీ ధమనులు గుండెకు పోషకాలను ఆక్సిజన్‌ ద్వారా అందజేస్తాయి. వీటి ప్రసరణకు అడ్డంకి ఏర్పడితే గుండె పని తీరు సహజత్వాన్ని కోల్పోయి గుండె కండరానికి రుగ్మత ఏర్పడుతుంది.
శరీరంలో రక్త పీడనం అంటే బ్లడ్‌ ప్రెషర్‌ సాధారణ స్థితిని దాటినప్పుడు గుండెజబ్బులు వస్తాయి. సాధారణంగా సిస్టోలిక్‌, డయాస్టోలిక్‌తో నిర్ధారిస్తారు. ఈ రీడింగు 130/80 ఎంఎంహెచ్‌జిగా ఉండాలి. శరీరంలో మిలియన్ల కొద్దీ జీవకణాల్లో ప్రతి ఒక్క కణానికి పోషణ నిమిత్తం రక్త ప్రసరణ జరగడానికి తగినంత ఒత్తిడి అవసరం. ఈ ఒత్తిడినే బిపిగా కొలుస్తారు.
పెద్దలలో సాధారణంగా రక్త ప్రసరణం 140/90 కంటే ఎక్కువ ఉండకూడదు. తీవ్రంగా వ్యాయామం చేసినప్పుడు, ఉద్రిక్తదశలోనూ పీడనం పెరుగుతుంది.

అత్యవసర పరిస్థితుల్లో వైద్యులు కొన్ని ముఖ్యమైన పరీక్షలు జరుపవలసి ఉంటుంది. లిపిడ్స్‌ శాతం పరీక్షించినప్పుడు ఉండవలసిన స్థాయికంటే ఎక్కువగా ట్రైగ్లిజరేట్లు, ఇతర కొవ్వు పదార్థాలు ఎక్కువవయితే హార్ట్‌ ఎటాక్‌ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
మనవారిలో ముఖ్యంగా హెచ్‌డిఎల్‌ అనే మంచి కొలస్ట్రాల్‌ తక్కువగా ఉండటం గమనార్హం. ఈ కొవ్వు పదార్థాలు వయస్సుతోపాటు పెరిగి రక్త ప్రసరణ సాఫీగా జరుగకుండా ఆటంకపరుస్తాయి.

బాల్యం నుంచే పేరుకునే ఈ కొవ్వు ప్రక్రియనే Atherosclerosis అంటారు. దీని ఫలితంగా ధమనులు వ్యాకో చించకుండా గట్టిగా అయి కఠినంగా మారుతాయి. ధమని అంతర వ్యాసం తగ్గిపోయి గుండె శరీరంలోని చివరి భాగానికి రక్త సరఫరా జరుగదు. గుండె కండరం సాధారణ స్థాయి కంటే ఎక్కువ శ్రమపడవలసి వస్తుంది. దీని వల్ల గుండెకు అలసట కలిగి గుండెనొప్పి ప్రారంభమవుతుంది.

వయస్సు పెరిగి రక్తపోటు, మధుమే హంతో బాధపడే వారిలో గుండెజబ్బు వచ్చే అవకాశాలు మరింత ఎక్కువ. చాలామందికి వయ స్సు మీదపడిన తరువాత డయాబెటిస్‌ వస్తుంది.స్థూలకాయం, వార సత్వం, వయోభారం, కుటుంబ చరిత్రలో గుండె జబ్బులు, అధిక రక్తపోటు వంటివి ప్రమాదకరంగా పరిణ మిస్తాయి.
నిద్ర మాత్రలకు అలవాటుపడిన స్త్రీల లోనూ, వయసుతో కొంతమార్పు వచ్చిన, జీవన శైలి వల్లను, ధూమపానం వల్ల కూడా గుండెజబబ్బులు వచ్చే అవకాశాలు పెరుగు తాయి. ఆందోళన, ఒత్తిడి, రెండు ప్రధాన కారణాలు. ఇవి ఎక్కువకాలం ఉంటే ఇతర జబ్బులతో గుండెజబ్బులు కూడా వస్తాయి.

తీసుకోవలసిన జాగ్రత్తలు
మనం వయస్సు పెరుగుతున్న కొద్దీ అనేక జాగ్రత్తలు తీసుకోవాలి. రెగ్యులర్‌గా ఫిజిషి యన్‌ను లేదా కార్డియాలజిస్తును సంప్రదిం చాలి. బాల్యంలోనూ, పాఠశాలలోనూ గుండె జబ్బుల నిరోధానికి కృషి చేయాలి. అలా చేస్తే హృద్రోగం దరి చేరదు. దానికి సంబంధించిన మార్గదర్శక సూత్రాలు పాటించాలి.
అవి ఆహార నియమాలు, మితమైన ఆల్క హాల్‌, ధూమపానం మానడం, వ్యాయామం చేయడం, ఒత్తిడి తగ్గించుకోవడం వంటివి. బి.పి. డయాబెటిస్‌ అదుపులో ఉంచుకోవాలి.

ఎకోకార్డియోగ్రామ్‌ ఒక జిరాక్స్‌ కాపీని ఎప్పుడూ దగ్గర ఉంచుకోవాలి. కామినేని ఆసుపత్రిలో దీనికి సంబంధించిన ప్యాకేజీలు మనకు ఎంతోకాలంగా అందుబాటులో ఉన్నాయి. గుండెకు సంబంధించిన పరీక్షలు అతి తక్కువ ఖర్చుతో చేయించుకుని ఇంట ర్‌వెన్షనల్‌ కార్డియాలజిస్ట్‌ సలహా పొందవచ్చు.

వ్యాధి వచ్చిన తరువాత ఆందోళన, ఆదుర్దా పడేకంటే, రాకుండా ఏమేమి జాగ్రత్తలు తీసు కోవాలో, అవి తీసుకుంటే మంచిది.

-
స్త్రీలలో గుండెజబ్బులు : చికిత్సలు(డాక్టర్‌ ప్రమోదక్‌ కుమార్‌ కె. ఇంటర్‌వెన్షనల్‌ కార్డియాలజిస్ట్‌, వొకార్డు హార్ట్)

గుండెజబ్బులు స్త్రీలను నేడు ఎక్కువగా కబళి స్తున్నాయి. ఇవి ముఖ్యంగా 60 సంవత్సరాలు పైబడిన వారికి కరొనరీ ధమనులు కుంచించుకు పోవడం ఆ ప్రదేశంలో కొవ్వు శాతం ప్రోగవడం క్రమంగా ఈ స్థితి గుండెపోటుకు దారి తీస్తుంది. దీనికి అనేక కారణాలు చెప్పబడుతున్నాయి. ఈ ప్రమాదం కలిగించే కారణాలలో కొన్నింటిని మనం తగ్గించుకోవచ్చు. అంటే మన జీవనశైలిని మార్చుకోవడం ద్వారా, ఉదాహ రణకు - రక్తపోటు నియంత్రణలో ఉంచడం, మధుమేహం అదుపు, వ్యాయామం వంటివి అవసరమైన మేర చేయడం, కొవ్వు పదార్థాలు తినకపోవడం వంటివి. అయితే మనం కొన్నింటిని మార్చలేము. ఉదాహరణకు వయస్సు, రేసు, కుటుంబ చరిత్ర వంటివి.

ప్రమాదం ఎలా కనిపెట్టాలి?
ఫ్రామింగ్‌హమ్‌ హార్ట్‌ స్టడీ పరిచయం చేసిన పట్టిక ప్రకారం గుండె జబ్బు తీవ్రత, దాని హెచ్చుతగ్గులు స్థాయిలు రాబోయే 10 సంవత్సరాల వరకూ అంచనా వేయవచ్చు. ఈ స్థాయి 20 శాతం ఉంటే చాలా ఎక్కువ. 10 నుంచి 20 శాతం అయితే మధ్యస్థం, 10 శాతం కంటే తక్కువ అయితే ప్రమాదం చాలా తక్కువ. అవసరాన్నిబట్టి వైద్య సహాయం పొందాల్సి ఉంటుంది.

ఎలా కాపాడుకోవాలి?
(జబ్బు తాలూకు సంఘటనను తెలుసుకొను శాస్త్రం) ఎపిడమలాజికల్‌ స్టడీస్‌ సహాయంతో 80 శాతం ప్రమాదాలు చిన్న చిన్న జీవన విధానాలు మార్చుకోవడం ద్వారా తగ్గించవచ్చు.

పొగ తాగవద్దు : ప్రమాదం రెట్టింపు అవడానికి మీరు రోజూ తాగే 1 నుంచి 4 సిగరెట్లు చాలు. పొగ తాగడం ఆపివేస్తే 50 శాతం రిస్కు మొదటి సంవత్సరంలో తగ్గించుకోవచ్చు. 5 సంవత్సరాల తరువాత పొగ అసలు తాగనివారితో సమానంగా ఉంటారు.
శారీరక ఆరోగ్యం : కనీస వ్యాయామం చేయాలి. ఏరోబిక్స్‌, బ్రిస్క్‌వాక్‌ వంటివి చేయడం ద్వారా రాబోయే ప్రమాదాన్ని 30 నుంచి 40 శాతం తగ్గించుకోవచ్చు.

ఆహారపు అలవాట్లు : ఆహారంలో పండ్లు, కూరగాయలు, కొవ్వు పదార్థాలు లేనివి, చేప, దినుసులు, పౌల్ట్రీ వంటివి తీసుకోవడం
బరువు సమతూకం : బి.ఎం.ఐ. సూచిక, ఇది 18.5 నుంచి 24.9 మధ్య ఉండేట్లు చూసుకోవాలి. నడుము కొలత 35 కంటే తగ్గించుకోవాలి. తీపి, కొవ్వు పదార్థాలు మానడం, స్నాక్స్‌ తినకపోవడం వంటి అలవాట్లతో సరైన బరువు ఉంచుకోవచ్చు.
గర్భధారణ సమయంలో గుండె జబ్బులు వస్తే?
గర్భం ధరించిన తరువాత గుండె వ్యవస్థలో అనేక మార్పులు వస్తాయి. గుండె మోయవల సిన బరువు ఎక్కువ అవుతుంది. ఏదేమైనా గుండెజబ్బుతో బాధపడేవారు గర్భం దాలిస్తే దుష్ఫలితాలు పిండం మీద, తల్లి మీద ఉంటాయి.

చికిత్స
కార్డియాలజిస్టు పర్యవేక్షణలో రోగి ఉండాలి. తరచూ పరిస్థితిని అంచనా వేయాలి. ఉదా హరణకు - ఎక్స్‌రే, ఇసిజి, స్కానింగ్‌ వంటి పరీక్షలు చేయాల్సి ఉంటుంది. అవసరమైన వైద్యం చేయడం వల్ల ప్రసూతి వైద్యునిపు ణులకు వెసలుబాటుగా ఉంటుంది. తల్లి గుండె పరిస్థితి తెలుస్తుంది.

ప్రెగ్నెన్సీ సమయమంతా మందులు వాడాలా?
కార్డియాలజిస్టు లోతుగా ఆలోచించి, పరీ క్షించి మందులురాస్తారు. మధ్యమధ్యలో మార్చ వలసి ఉంటుంది. వాల్వ్‌రిప్లేస్‌మెంట్‌ అయిన వారు వాడే యాంటికోయాగ్యులేషన్‌ మందులు అవరోధం. వీటి గురంచి రోగితో చర్చించి ఏం వాడాలో, ఎలా వాడాలో శరీర ధర్మశాస్త్రం ప్రకారం వివరిస్తారు. ఈ అవసరం గుండె జబ్బులు ఉండి ప్రెగ్నెన్సీ ధరించదలచుకున్న వారికి అవసరం. వారి శరీర ధర్మశాస్త్ర ప్రకారం నిర్ణయిస్తారు. గుండె జబ్బులు ఉన్నవారు గర్భం ధరిస్తే వచ్చే ప్రమాదాలు లేనివారు ధరిస్తే వచ్చే ప్రమాదాల కంటే 10 శాతం ఎక్కువ.ఇంకా విడమర్చి చెప్పా లంటే తల్లిదండ్రులకు ఇద్దరికీ గుండె జబ్బులు ఉంటే పిల్లలకు ఇది ఇంకా ఎక్కువ శాతం స్కానింగ్‌ ద్వారా గుండెకు సంబంధించిన సమస్య బిడ్డలో ఏమైనా ఉందేమో తెలుసు కోవచ్చు. ఎందుకంటే కొన్నిసార్లు గర్భం తొలగించాల్సి ఉంటుంది.

గర్భధారణ చివరి మూడు నెలల్లో గుండె 20 సార్లు ఎక్కువగా కొట్టుకుంటుంది. రక్తహీనత ఏర్పడి హీమోగ్లోబిన్‌ లెవెల్స్‌ తగ్గుతాయి. ప్రసవ సమయంలో ఆక్సిజన్‌ ఎక్కువగా అవసరమవుతుంది. తద్వాఆర బి.పి. గుండె రేటు ఎక్కువవుతుంది. ప్రసవం తరువాత 12 - 24 వారాలు గుండె రక్త ప్రసరణ సాధారణ స్థితికి చేరుకోవటానికి పడుతుంది.ఏదేమైనా స్త్రీలలో గుండెజబ్బులు సాధారణమైపోయాయి. 45 సంవత్సరాలు పైబడిన తరువాత ప్రతి సంవత్సరం రెగ్యులర్‌ చెకప్‌ చేయించుకోవాలి. వ్యాధి రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు పాటించాలి. గర్భంలో ఉండి గుండె జబ్బులు వస్తే ముందు జాగ్రత్త పడటం కార్డియాలజిస్టు పర్యవేక్షణలో ఉంచడం చేయాలి. రిస్క్‌లు గణాంకపరంగా చెప్పలేము. సిహెచ్‌డి ఉన్న స్త్రీలలో కూడా అన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఆరోగ్యవంతమైన పిల్లలు పుట్టే అవకాశం ఉంది.
-------------------------------------------------------------------------------------------------
పుట్టుకతో వచ్చే గుండె రంధ్రాలను మూయటానికి ఇప్పుడొక కొత్త పరికరం అందుబాటులోకి వచ్చింది. బయోస్టార్‌ అనే ఇది ఆర్నెళ్ల తర్వాత శరీరంలో కలిసిపోతూ చిన్న, మధ్య రకం రంధ్రాలను సమర్థవంతంగా మూసివేస్తోంది కూడా. బయోస్టార్‌ అమర్చిన 10 మంది పిల్లలపై ఇటీవల అధ్యయనం చేశారు. దీనిని అమర్చిన వారిలో 24 గంటల్లో 90 శాతం వరకు రంధ్రాలు మూసుకుపోగా.. ఆరు నెలల తర్వాత పూర్తిగా మూసుకుపోయాయి. గొడుగులాంటి ఈ పరికరాన్ని ఆపరేషన్‌తో పనిలేకుండానే గుండెలో అమరుస్తారు. ఇది లోహాలతో తయారుచేసే ఇతర పరికరాలతో సమానంగా పనిచేస్తున్నట్టు టొరంటోలోని ఓ పిల్లల ఆసుపత్రి ఎండీ లీ బెన్సన్‌ అంటున్నారు. ఆరునెలల తర్వాత ఈ పరికరం పూర్తిగా కరిగిపోయి దాని మీద కొత్త కండరం వస్తోంది. కేవలం దీనికి దన్నుగా ఉండే సన్నటి తీగలు మాత్రమే మిగిలాయి. ఇందులో చాలా కొద్ది మొత్తంలోనే లోహాలు ఉంటాయి కాబట్టి గుండె లయ దెబ్బతినే వారికి చికిత్స చేయటంలోనూ ఇది బాగా ఉపయోగపడొచ్చని లీ బెన్సన్‌ భావిస్తున్నారు. ఇప్పటివరకు వినియోగిస్తున్న పరికరాలనీన లోహంతో తయారైనవే. దీంతో మున్ముందు ఆ లోహాలు అరగటం, గుండె గదులతో రాపిడి మూలంగా తీవ్రమైన ఇన్‌ఫెక్షన్లకు దారి తీయటం వంటి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. కొత్త పరికరంతో ఇలాంటి ఇబ్బందుల బెడద తప్పుతుంది. ఈ బయోస్టార్‌ని అమర్చినవారిలో ఒకరికి మాత్రమే రంధ్రం సరిగా మూతపడలేదు. అయినప్పటికీ ఎలాంటి రక్తస్రావం జరగకపోవటం గమనార్హం.

గుండెకు యోగా..
గుండె గుప్పెడంతే.. కానీ శరీర ఆరోగ్యంలో దాని పాత్ర కొండంత.అందుకే గుండెని పదిలంగా ఉంచుకొంటూ ఎప్పటికప్పుడు దాని పరిరక్షణకి శ్రద్ధ తీసుకోవడం అత్యవసరం అంటున్నారు యోగ నిపుణురాలు అరుణ. యో్గా వలన గుండెజబ్బులు నివారించవచ్చును.

పవన ముక్తాసనం

వెల్లకిలా పడుకొని కాళ్లు రెండింటిని దగ్గరగా ఉంచాలి. గాలిని తీసుకొంటూ కుడికాలిని పైకి మడిచి మోకాలిని పొట్ట వైపునకు రెండు చేతులతో నొక్కిపట్టి ఉంచాలి. తర్వాత మెల్లగా గాలిని వదులుతూ తలని పైకి లేపి మోకాలిని పెదవులకు ఆనించాలి. పది నుంచి ఇరవై సెకన్ల పాటు అలా ఉంచి తలని యథాస్థానానికి తీసుకురావాలి. తర్వాత గాలిని వదులుతూ కాలిని కిందికి పెట్టాలి. ఇదే విధంగా ఎడమ కాలితో కూడా చెయ్యాలి. మార్చిమార్చి ఆరు సార్లుచెయ్యాలి.
శశాంకాసనం
వజ్రాసనంలో కూర్చుని రెండు చేతులు వెనుకకు పెట్టాలి. చేతులను ఒకదానితో ఒకటి అంటే ఎడమచేతి మణికట్టుని కుడిచేతితో పట్టుకొని నెమ్మదిగా గాలి తీసుకొని ఆ గాలిని వదిలేస్తూ మెల్లగా ముందుకు వంగాలి. నుదుటిని నేలకు ఆనించి గాలిని పీలుస్తూ వదులుతూ అలా పది సెకన్లు ఉండి మెల్లగా గాలిని పీల్చుకొంటూ పైకి రావాలి. ఇలా మూడు సార్లు చెయ్యాలి.
ఓంకార ప్రాణాయామం
ప్రశాంతంగా కూర్చొని రెండు చేతులు సూర్యముద్రలో మోకాళ్లమీద పెట్టి నెమ్మదిగా గాలిని తీసుకోవాలి. తిరిగి గాలి వదిలేటప్పుడు ఓంకార శబ్దం చెయ్యాలి. ఓమ్‌ ఎలా అనాలంటే ముందుగా నాభి నుంచి అ కార శబ్దాన్ని చేస్తున్నట్లు వూహించుకోవాలి. పెదాలని సున్నాలా చుట్టి ఉకార శబ్దాన్ని చెయ్యాలి. తర్వాత పెదాలని మూసి 'మ్‌' శబ్దం చెయ్యాలి. ఇలా చేస్తే ఓంకారం వినబడుతుంది. నేరుగా ఓం అనడం కన్నా ఇలా చెయ్యడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి.

  • సూర్యముద్ర: ఉంగరం వేలు మడిచి గోరువైపు నుంచి మొదటి కణుపు మీద బొటనవేలు ఉంచాలి. మిగిలిన
వేలు నిటారుగా ఉంచాలి. ఈ ముద్ర వల్ల కొవ్వు బాగా తగ్గుతుంది. గుండె సంబంధిత ఇబ్బందులు ఉన్నవాళ్లు ఇలా చేయడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి.
అనులోమ విలోమ ప్రాణాయామం
సుఖాసనంలో కూర్చొని ఎడమ చెయ్యి ఎడమ మోకాలు మీద చిన్‌ముద్ర (బొటన వేలు, చూపుడు వేలును కలిపి మిగిలిన వేళ్లను నిటారుగా ఉంచాలి)లో ఉంచి కుడి చెయ్యి నాసికాముద్రలో అంటే చూపుడు వేలు మధ్యవేలు మడిచి చిటికెన వేలు, ఉంగరం వేలు నిటారుగా ఉంచాలి. ముందుగా కుడిముక్కు మూసి ఎడమ ముక్కుతో గాలిని తీసుకొని కుడిముక్కుతో గాలిని వదిలి మరల అదే ముక్కుతో గాలి తీసుకొని ఎడమ ముక్కు నుంచి వదలాలి. ఇది ఒక రౌండు అంటారు. ఇలా ఐదు నుంచి పదినిమిషాలు చెయ్యాలి.
గమనిక: గుండె శస్త్రచికిత్సలు జరిగిన వాళ్లు... సంబంధిత ఇబ్బందులున్నవారు తప్పనిసరిగా వైద్యుల సలహాతో.. నిపుణుల ఆధ్వర్యంలో వీటిని చేయాల్సి ఉంటుంది.
కటి ఆసనం
నేలపై వెల్లకిలా పడుకొని కాళ్లని తొంభై డిగ్రీల కోణంలో పెట్టాలి. నెమ్మదిగా మోకాళ్లు కొద్దిగా పైకి మడిచి ఉంచి.. రెండు చేతులతో రెండు కాళ్ల బొటనవేళ్లు పట్టుకొని కాళ్లు కాస్త ఎడంగా పెట్టాలి. ఇలా చేసేటప్పుడు తలని పైకి ఎత్తకూడదు. ఈ ఆసనం వల్ల గుండెకు రక్తం బాగా సరఫరా అవుతుంది.

గుండెకు 'కొలి'మి--updated 25-12-2010
మీరు తాగుతున్న నీరు సురక్షితమైనదేనా? అందులో ఇ.కొలి బ్యాక్టీరియా ఉందేమో ఓసారి పరీక్షించుకోండి. ఈ బ్యాక్టీరియాతో కలుషితమైన నీటిని తాగితే మున్ముందు అధిక రక్తపోటు, గుండెజబ్బులు, కిడ్నీ సమస్యల బారిన పడే ప్రమాదముంది. 2000 సంవత్సరంలో ఇ.కొలి బ్యాక్టీరియాతో కలుషితమైన నీటిని తాగి జబ్బుపడిన వారిపై కెనడా పరిశోధకులు ఒక అధ్యయనం చేశారు. ఎనిమిదేళ్ల తర్వాత వీరిని పరిశీలించగా తీవ్రంగా జబ్బుపడిన వారిలో అధిక రక్తపోటు, కిడ్నీ సమస్యలు, గుండెజబ్బులు, పక్షవాతం వంటివి ఇతరుల కన్నా ఎక్కువగా కనిపించాయి. పలుదేశాల్లో చాపకింద నీరులా విస్తరిస్తున్న గుండెజబ్బుల నివారణకు సురక్షిత నీటి సరఫరా కీలకమైన అంశమని తాజా పరిశోధన సూచిస్తోంది.

హృదయ సంబంధ వ్యాధులపై ప్రజల్లో అవగాహన , Heart diseases Awareness

- డాక్టరు బుడుమూరు అన్నాజీరావు,కార్డియాలజిస్ట్‌, కిమ్స్‌ సాయి శేషాద్రి ఆసుపత్రి--గుండె సంబంధ ఇబ్బందులపై డాక్టరు అన్నాజీరావు చెప్పిన వివరాలివి...


'హృదయ సంబంధ వ్యాధులపై ప్రజల్లో అవగాహన లేదు. అందుకే గుండెపోటు మరణాలు సంభవిస్తున్నాయి. స్వల్ప జాగ్రత్తలు తీసుకుంటే.. తేలిగ్గా అధిగమించవచ్చు. ఆహార నియమాల్లో జీవనశైలి మారిపోవడమే హృద్రోగాలకు కారణం. దేశంలో 26 లక్షల మంది ఈ వ్యాధులతో బాధపడుతున్నారు. 54 శాతం పల్మనరీ హార్ట్‌ పీడితులున్నారు. మన జిల్లాలో ఎక్కువ కేసులు నమోదవుతున్నాయి. శారీరక శ్రమ, వ్యాయామం చేయకపోవడం, మితిమీరి భుజించడం, వంట నూనెల వాడకంలో జాగ్రత్తలు తీసుకోకపోవటం శరీరంలో కొవ్వు పెరిగి
గుండెపోటుకు దారితీస్తోంది. పని ఒత్తిడి వల్ల కనీసం ఆరోగ్య పరీక్షలు చేయించుకోలేకపోతున్నాం. పిల్లల్లోనూ గుండెపోటు కనిపిస్తోంది. అందుకే ప్రభుత్వం అంటురోగాలు కానివాటి కోసం ప్రతీ ఆసుపత్రిలో ప్రత్యేక క్లినిక్‌ ఏర్పాటు చేసేందుకు నిర్ణయించింది.

- జిల్లా వైద్యఆరోగ్య శాఖాధికారి డాక్టరు ఎన్‌.ప్రసాద్‌--భయమెందుకు..?
గుండె పోటుతో భయపడాల్సిన పని లేదు. పిండం వృద్ధి చెందిన 21 రోజుల నుంచి తుది శ్వాస విడిచే వరకూ గుండె నిరంతరాయంగా పని చేస్తుంది. చాలామంది గుండెపై కనీస శ్రద్ధ కూడా చూపరు. అందుకే హృద్రోగానికి గురైన కొన్ని సందర్భాల్లో క్షణాల్లోనే మరణం సంభవిస్తోంది. చిన్నపాటి జాగ్రత్తలు పాటిస్తే మన హృదయం పదిలంగానే ఉంటుంది. రెస్టారెంట్లు, దాబాల్లో ఆహార పదార్థాలకు యువత దూరంగా ఉండడమే మేలు. పిజ్జాలు, బర్గర్లను తినటం వల్ల గుండె రక్తనాళాల్లో ఇబ్బందులు ఏర్పడతాయి.

- డాక్టరు బుడుమూరు అన్నాజీరావు,కార్డియాలజిస్ట్‌, కిమ్స్‌ సాయి శేషాద్రి ఆసుపత్రి-గుండె సంబంధ ఇబ్బందులపై డాక్టరు అన్నాజీరావు చెప్పిన వివరాలివి...

ఇరవై ఏళ్ల నుంచే సమస్యలు-- గతంలో యాభై ఏళ్లు దాటితే గుండెనొప్పి గురించి ఆలోచించేవాళ్లు. ఇపుడు 20 ఏళ్లు దాటిన వారిలో ఇది కనిపిస్తోంది. జన్యు లోపాల వల్ల చిన్నారుల్లోనూ గుండె జబ్బులు పెరుగుతున్నాయి. చిన్న పిల్లల్లో పక్కటెముకలు ఎగిరితే.. చిన్నపిల్లల వ్యాధి లక్షణాలుగా భావిస్తుంటాం. ఇది గుండెజబ్బుకు సూచిక.

గుండె నొప్పి లక్షణాలు
గుండెకు రక్తం అందించే రక్తనాళాల లోపల గోడలకు కొవ్వు పేరుకుపోయి రక్తప్రసరణ తగ్గుతుంది. గుండె కండరానికి రక్తం సరఫరా తగ్గి నొప్పి మొదలవుతుంది.గుండెకు అసౌకర్యంగా ఉండి.. నొప్పి క్రమేపీ ఎడమ చేతికి, కొన్నిసార్లు కుడి చేతికి.. గొంతు, దవడలు, నడుము, ఉదరం ఇలా వివిధ ప్రాంతాలకు విస్తరిస్తుంది.శ్వాస కష్టమవుతుంది. శరీరమంతా చెమటలు పట్టడం, కళ్లు తిరగం గమనించవచ్చు. ఈ లక్షణాలను తేలిగ్గా తీసుకోకూడదు.వంశపారంపర్యంగా వచ్చే జన్యూపరమైన కారణాల వల్ల గుండెనొప్పి వస్తుంది. వీటిని గుర్తించడం కష్టం. మధుమేహం, రక్తపోటు, హైకొలస్ట్రాల్‌, ఊబకాయం, పొగతాగడం, వ్యాయామం లేకపోవడం గుండెపోటుకు కారణాలు.మహిళలకూ గుండెపోటు వస్తుంది.

యాంజీయోప్లాస్టీతో అదుపు
రక్తనాళాల గోడలకు ఏర్పడిన కొవ్వును తొలగించడమే యాంజియోప్లాస్టీ. గతంలో బైపాస్‌ సర్జరీతో తొలగించేవారు. ఛాతీని తెరచి.. శస్త్రచికిత్స చేసేవారు. పూర్తిగా తగ్గేందుకు మూడు నెలలు పట్టేది. యాంజియోప్లాస్టీ వల్ల ఒకట్రెండు రోజుల్లోనే పూర్తి స్థాయిలో పని చేసుకోవచ్చు.

ఈ విధానంలో కోత లేకుండా సన్నటి బెలూన్‌ను ముంజేతి లేదా తొడ నుంచి రక్తనాళాల ద్వారా పంపి సరిగ్గా కొవ్వు పేరుకుపోయి ఉన్నచోట ఉంచి బెలూన్‌ ఉబ్బించడం ద్వారా పూడిక తొలగేలా చేస్తారు. ఆ ప్రాంతంలో ఇబ్బంది తలెత్తకుండా సన్నటి స్ప్రింగ్‌ వంటి 'స్టెంట్‌'ను అమరుస్తారు. చికిత్స తరువాత రెండ్రోజుల్లో ఇంటికెళ్లిపోవచ్చు.

యాంజియోప్లాస్టీ స్టెంట్‌ల గురించి భయం వద్దు.
కొవ్వు గట్టిపడిపోతే.. తేలిగ్గా డ్రిల్‌ చేసి తొలగించేందుకు రోటాబ్లేటర్‌ పరికరం, సున్నితమైన బ్లేడు అమర్చిన కటింగ్‌ బెలూన్లు అందుబాటులోకొచ్చాయి. ఎక్కడ తొలగించాలో కచ్చితంగా అంచనా వేసే ప్రెషర్‌ ట్రాన్స్‌డ్యూసర్‌ వైర్లు అందుబాటులోకొచ్చాయి. రక్తనాళాల ద్వారానే లోపలికి పంపి కొవ్వు ఎంతమేర పేరుకుపోయిందో పరిశీలించేందుకు వీలైన సన్నటి 'ఇంట్రావాస్కులర్‌ అల్ట్రాసౌండ్‌ ప్రోబ్‌లు' అందుబాటులో ఉన్నాయి.

ఎలాంటి పరీక్షలు అవసరం?
గుండెనొప్పితో బాధపడేవారు... 40 ఏళ్లపైబడిన వారు తక్షణం, ఏడాదికోసారి తప్పనిసరిగా ఈ దిగువ పరీక్షలు చేయించుకోవాలి.
ఇ.సి.జి; టి.ఎం.టి.; యాంజియోగ్రాం

సదస్సుకు హాజరైన పలువురు గుండె సంబంధిత ఇబ్బందులపై సందేహాలు వెలుబుచ్చారు. వీటికి కార్డియాలజిస్ట్‌ బుడుమూరు అన్నాజీరావు సమాధానాలిచ్చారు.

పశ్న: గుండెపోటు లక్షణాలు కనిపించగానే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?- చల్లా జగదీష్‌, వ్యాయామ ఉపాధ్యాయుడు.
జవాబు: ముందుజాగ్రత్తగా జేబులో సార్బిట్రేట్‌, ఇకోస్ప్రిన్‌ మాత్రలు ఉంచుకోవాలి. ప్రయాణాలు, ఇతర పనుల్లో ఉన్నపుడు నొప్పి తీవ్రంగా ఉందనిపిస్తే వెంటనే ఈ మాత్రల్లో ఒకటి నాలిక

కింద ఉంచుకోవాలి. తరువాత వైద్యుడిని సంప్రదించాలి.

ప్ర: కవాటాల సమస్యలో పక్షవాతం ఎందుకు వస్తుంది? టి.ఎం.టి పరీక్షలో పాజిటీవ్‌ ఉండీ యాంజియోగ్రాంలో నార్మల్‌గా ఉండవచ్చా?--డాక్టర్‌ పి.రవీంద్రనాధ్‌, గుజరాతీపేట
జ: కవాటాలు ముసుకుపోవడం వల్ల రక్తనాళాల్లో రక్తం గడ్డకడుతుంది. పక్షవాతం వచ్చే అవకాశం ఉంది. థ్రెడ్‌మిల్‌ పరీక్ష (టి.ఎం.టి)లో వ్యాధి లక్షణాలు ఉండీ యాంజియోగ్రామ్‌లో

లేనట్టు తేలితే మైక్రోవాస్కూలర్‌ ఇస్కీమియా అంటారు. ఈ స్థితిలో హృద్రోగ నిపుణుల సూచనలపై మందులు వాడాలి.

ప్ర: గుండె సంబంధ వ్యాధులకు చికిత్స ఖరీదైన వ్యవహారం. రాయితీ ఏమైనా ఉంటుందా?--- బొడ్డేపల్లి మోహనరావు
జ: గుండె పరీక్షలకు రూ. 3 వేలవుతుంది. కిమ్స్‌ సాయిశేషాద్రి ఆసుపత్రిలో రూ. 1800కే చేస్తున్నారు. రోగి ఆర్థిక పరిస్థితి బట్టి ఇంకా రాయితీ ఇచ్చే అవకాశం ఉంది.

ప్ర: 2007లో గుండెపోటు వచ్చింది. క్రమం తప్పకుండా మందులు వాడుతున్నా. ఎప్పుడెప్పుడు పరీక్షలు చేయించుకోవాలి? - ఎస్‌.వెంకటరావు
జ: గుండెపోటు వచ్చిన తరువాత ప్రతీ ఆరు నెలలకోసారి ఇకో పరీక్ష చేయించుకోవాలి. నిర్లక్ష్యం వద్దు.

ప్ర: 2010 డిసెంబరులో నాకు ఎ.ఎస్‌.డి. డివైస్‌ అమార్చరు. ఇటీవల ఆయాసం, కాళ్ల వాపులు వస్తున్నాయి. వివాహమై మూడునెలలయింది. గర్భం ధరిస్తే సమస్య వస్తుందా?--- మజ్జిచంద్రకళ. శ్రీకాకుళం
జ: ఏట్రియల్‌ స్టెప్టల్‌ డిఫాల్ట్‌ (ఎ.ఎస్‌.డి) అమర్చిన తరువాత అన్ని పనులూ చేసుకోవచ్చు. గర్భం ధరించినా ఇబ్బందేమీ ఉండదు. కాళ్ల వాపు అనేది వేరే సమస్య కావచ్చు. ఫిజీషియన్‌ను సంప్రదించండి.

ప్ర: నాకు 61 సంవత్సరాలు. గుండె నొప్పితో బాధపడుతున్నాను. విశాఖపట్నంలో పరీక్ష చేయించుకుంటే ఏమీ లేదన్నారు. మూడు రకాల మందులిచ్చి వాడమన్నారు. ఎందుకు అలా సూచించారు.- కె.తాయారమ్మ, శ్రీకాకుళం

జ: సాధారణంగా 40 ఏళ్లు దాటిన వారు తప్పనిసరిగా ఏడాదికి, రెండేళ్లకు ఒకసారి హృదయ సంబంధ పరీక్షలు చేయించుకోవాలి. మీ విషయంలో పరీక్షల్లో ఏమీ లేదని తేలినందున ముందుజాగ్రత్తగా ఎలాంటి సమస్య రాకుండా మూడు రకాల మందులు రాశారు. క్రమం తప్పకుండా వేసుకోవాలి.

ప్ర: హృదయ సంబంధ వ్యాధులు రాకుండా ఏం చేయాలి? ఎలాంటి వంట నూనె వినియోగించాలి.- సి.రంగారావు, ఉపాధ్యాయుడు
జ: కొవ్వు శాతం తక్కువగా ఉండే ఏ నూనె అయినా వాడొచ్చు. రిఫైన్డ్‌ సన్‌ఫ్లవర్‌ అయిల్‌ వినియోగిస్తే మంచిది. వేపుడు, మసాలా కూరలు ఎక్కువగా తినొద్దు. నూనె వాడకం తగ్గించాలి.

ప్ర: 2004లో స్టెంట్‌ వేశారు.మందులు వాడుతున్నా.రెండో వాల్వుకు స్టెంట్‌ వేయాల్సి ఉంది.ప్రతీక్షణం భయంతో బతుకుతున్నా.ప్రమాదం ఉందా?- పి.వి.తేజేశ్వరరావు,ఆమదాలవలస
జ: ఒక వాల్వ్‌కు స్టెంట్‌ ఉంది. రెండో వాల్వుకు స్టెంట్‌ అవసరమని వైద్యులు సూచించారుకాబట్టి మరింత జాగ్రత్తగా ఉండాలి. ఆరు నెలలకోసారి ఈసీజీ, ఇకో పరీక్షలు చేయించుకోవాలి.


  • ======================
Visit my website - > Dr.Seshagirirao.com/

No comments:

Post a Comment

Your comment is very important to improve the Web blog.