Tuesday, September 21, 2010

మెదడువాపు వ్యాధి , Viral Encephalitis



మెదడు వాపు వ్యాధి -- వైరల్‌ ఎన్‌కెఫలైటిస్ ‌ : వర్షాల వలన అయితే నేమి.పారిశుద్ద్యం క్షిణించడం పందులు విచ్చల విడిగా తిరగడం వలన అయితేనేమి దోమల వల్లనైతేనేమి శ్రీకా్కుళం జిల్లాలో మెదడువాపు కదలికలు కనిపిస్తున్నాయి. ఈ వ్యాధి ఆర్‌ఎన్‌ఎ గ్రూపునకు చెందిన ఆర్బోవైరసు వల్ల వస్తుంది. ఈ వ్యాధి పందులు, కొంగలు, నక్కల లాంటి జంతువుల నుండి మనిషికి వస్తుంది. క్యూలెక్స్‌దోమలు ఈ వ్యాధిని వ్యాపింపచేస్తాయి. క్యూలెక్స్‌ దోమకాటుతో జపనీస్‌ ఎన్‌ఫలైటీస్‌ వైరస్‌ పిల్లల శరీరంలోకి వ్యాపిస్తుంది. ఫలితంగా మెదడుకు వాపు వస్తాది . సాయంత్రం సమయాల్లో క్యూలెక్స్‌ ప్రభావంతంగా ఉంటుంది. ఆ సమయంలో చిన్న పిల్లలను కాటు వేసే ప్రమాదం ఉంది. ఈ వ్యాధిని ‘జపనీస్ బి. ఎన్‌సెఫలైటిస్’ అంటారు

చరిత్ర : ఈ వ్యాధిని మొట్టమొదట క్రీ.శ.1871లో జపాన్‌లో గుర్తించారు. 1924లో జపాన్‌లో ఎపిడెమిక్ (ఏకకాలంలో అనేకమందికి వ్యాధి రావడం)లా మెదడువాపు వచ్చింది. అప్పటినుంచి 1970 వరకు ప్రతి ఏటా ఎపిడమిక్‌లా వచ్చింది. ఈ వ్యాధి మన దేశంతోపాటు ఎక్కువగా జపాన్, కొరియా, మలేషియాలలో ఉంది. మన దేశంలో క్రీ.శ.1955లో ఈ వ్యాధి మొట్టమొదటి ఎపిడెమిక్‌గా వచ్చింది. మన దేశంలో ఆరు రాష్ట్రాలలో ఈ వ్యాధి ఎక్కువగా ఉంది. అవి పశ్చిమ బెంగాల్, ఆంధ్రప్రదేశ్, కర్నాటక, కేరళ, తమిళనాడు మరియు అస్సాం రాష్ట్రాలు.

వ్యాధి లక్షణాలు

*సూక్ష్మజీవి మెదడులో ప్రవేశించిన ప్రతి వ్యక్తిలో ఈ వ్యాధి రాదు. వ్యాధి నిరోధక శక్తి లోపించినవారే ఈ వ్యాధికి గురవుతారువైరస్‌ రోగి శరీరం లోకి ప్రవేశించిన తరువాత 5 నుంచి 16 రోజుల్లో పిల్లలకు జ్వరం రావడం శ్వాస పీల్చడంలో ఇబ్బంది కాళ్లు చేతులు లాగినట్లుగా ఉంటుంది. వాంతులు కావడం తద్వారా మెదడు వాపు వ్యాధి సోకి, జ్వరము, వణుకు, ప్రవర్తనలో మార్పు, వస్తూ అపస్మారక స్థితికి చేరుకోవడం, ఫిట్స్‌, నిద్రమత్తు, రోగ తీవ్రతని తెలియచేస్తుంది. దృష్టిలోపం కూడా కలుగవచ్చు. మూత్ర విసర్జనపై, మల విసర్జనపై నియంత్రణ కోల్పోవచ్చు. సరైన సమయంలో రోగ నిర్థారణ కాకపోతే మరణం సంభవించును. జబ్బు నుండి కోలుకున్నాక కూడా
* ఆకస్మిక జ్వరం వచ్చుట, జ్వర తీవ్రత ఎక్కువగా ఉండుట
* కండ్లను అసాధారణంగా త్రిప్పుట
* అపస్మారక స్థితి సంభవించుట
* ఏదో ఒక పక్క శరీరం పక్షవాతానికి గురి అగుట
* వాంతులు, విరేచనాలు సంభవించుట
* శరీరం మెలికలు తిరిగి కొట్టుకొనుట
* మానసిక మాంద్యము
కొన్నాళ్ళ పాటు లేదా జీవితాంతము రోగి బాద పడవచ్చును . ఇదే దీనికున్న భయంకరమైన వ్యాధి లక్షణము .

వీరికి రక్త పరీక్షలు, వెన్నుపూసల నుంచి నీరు తీసి పరీక్ష చేసి వ్యాధిని నిర్ధారించాల్సి ఉంటుంది

వ్యాప్తి చెందు విధానం

* జపనీస్ బి వైరస్ అనే సూక్ష్మజీవి దోమల ద్వారా ఇతర జంతువుల ద్వారా (ముఖ్యంగా పందులు) ఈ వ్యాధి ని సంక్రమింప చేస్తాయి.
* పందులు, పశువులు, గుర్రాలు, కొంగలు ఈ వైరస్ ముఖ్యస్థావరాలు. దోమలు వీటిని కుట్టి మనిషిని కుట్టినప్పుడు ఈ వైరస్ మనిషిలో ప్రవేశించి రోగాన్ని కలుగచేస్తాయి. మనిషి నుంచి మనిషికి ఇది వ్యాప్తి చెందదు.
* పందులను కుట్టిన దోమలు ఆరోగ్యవంతుని కుట్టిన తర్వాత 7 నుండి 10 రోజుల వ్యవధిలో వ్యాధి లక్షణాలు కన్పించును. ఈ వ్యాధి ముఖ్యంగా 1 నుండి 14 సంవత్సరముల లోపు పిల్లలకు ఎక్కువగా వచ్చే అవకాశఁ వుంది.
సెప్టెంబర్ నుండి డిసెంబర్ వరకు మెదడువాపు వ్యాధి ప్రబలుతున్నది. వర్షాధారంగా నిలువవున్న నీటి స్థావరాలు పెరిగిన కొలదీ దోమలు ఉత్పత్తి పెరుగును. క్యూలెక్స్ (గూని దోమ) దీని వ్యాప్తికి దోహదపడతాయి.

ప్రథమ చికిత్స...

మెదడు వాపు వ్యాధి సోకిన వారికి వెంటనే ప్రథమ చికిత్సలు కుటుంబ సభ్యులు చేయాలని డాక్టర్ల వద్దకు తీసుకుపోయేంత వరకు వ్యాధి సోకిన రోగి తలను కొద్దిగా వంచి పడుకోబెట్టాలని నోటి నుంచి లాలాజలం కారకుండా చూడాలని ఎప్పటికప్పుడు లాలాజలం తడుస్తుండాలని రోగి శరీరం చల్లబడితే వెచ్చడి దుస్తులనుకప్పాలని, రోగికి జ్వరం వస్తే మంచినీటిలో ముంచిన తడిగుడ్డతో తుడవాలని, కాంతి ధ్వని శబ్దాలకు రోగిని దూరంగా ఉంచాలని వైద్యులు పేర్కొన్నారు.

ఈ వ్యాధిని కలిగించే సూక్ష్మజీవిని హరించే మందులు ఏవీ లేవు. వ్యాధి లక్షణాలు కనిపించిన వెంటనే రోగిని దగ్గరలోని వైద్య నిపుణుల వద్దకుగానీ, ఆసుపత్రికిగానీ తీసుకెళ్లాలి. సహాయక చికిత్స - నర్సింగు చర్యలు రోగికి ప్రధానంగా అవసరం. రోగి పరిస్థితిని బట్టి మందుల వాడకం వుంటుంది.కొన్ని అంచనాల ప్రకారం ఈ వ్యాధి వచ్చిన వారిలో మూడొంతుల మంది మరణిస్తారు. మూడొంతుల మంది పూర్తిగా కోలుకుంటారు. మూడొంతుల మంది బతికి బట్టకట్టినా రకరకాల అంగవైకల్యం, పక్షవాతం, జ్ఞాపకశక్తి లోపించడం, బుద్ధిమాంద్యం, వినికిడి లోపాలు, దృష్టి లోపాలు లాంటి సమస్యలతో జీవిస్తారు.

*మెదడు వాపు వ్యాధి రాకుండా వ్యాధి నిరోధక టీకా ఉంది. ఖరీదైనది. ఎక్కువసార్లు ఇవ్వాలి. ఈ టీకాను జాతీయ సార్వత్రిక వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమంలో పొందుపరచలేదు. కొన్ని ప్రాంతాలు అంటే తీవ్రంగా వ్యాధి వచ్చే ప్రాంతాలలో ఈ టీకాను మన దేశంలో ఇస్తున్నారు. 7 నుండి 14 రోజుల వ్యవధిలో రెండు మోతాదులు ఇవ్వవలసి ఉంటుంది. అప్పటినుండి 3 సంవత్సరాలకొకమారు రీవ్యాక్సినేషన్ ఇవ్వాలి. అన్ని మోతాదులు క్రమంగా తీసుకున్నవారిలో మాత్రమే పూర్తి రక్షణ ఉంటుంది.

వ్యాధిని అరికట్టడానికి కార్యాచరణ పథకం

* దోమల ఉత్పత్తి అరికట్టడం
* నీటి స్థావరాలని పూడ్చి వేయడం
* ప్రజలలో వ్యాధి అరికట్టడానికి ఒక నెల ముందే అవగాహన శిక్షణలు / సదస్సులు గ్రామ కమిటీలలో చర్చించడం.
* ఆరోగ్యశాఖ తీసుకొనే చర్యలలో ప్రజలని భాగస్వామం చేసి పాల్గొనేలా చేయడం.
* రోగిని గుర్తించి వెంటనే ఆసుప్రతికి తరలించడం.
* గ్రామ ప్రజలతో చర్చించి పందులను ఊరికి దూరంగా ఉంచేటట్లు చర్య తీసుకోవాలి.
* వ్యాక్సిన్ ఇచ్చు కార్యక్రమంలో సహకరించి పిల్లలకి వ్యాక్సిన్ డోసులు ఇప్పించాలి.



వ్యాధి రాకుండుటకు ముందు జాగ్రత్త చర్యలు

* దోమలు కుట్టకుండా దోమ తెరలు వాడాలి
* ఇంటిలోనికి దోమలు రాకుండా కిటికీలకు తలుపులకు సన్నని జాలి బిగించుకోవాలి
* ఓడోమాస్ లాంటి క్రీములను శరీరానికి రుద్దుకోవాలి
* ఇంటిలో జెట్, మస్కిటో కాయిల్ ఉపయోగించాలి
* పందులను గ్రామానికి కనీసం 5 కి. మీ. దూరంలో ఉంచాలి
* జాలరి గుంటలు, ఇంటిచుట్టు ప్రక్కల నీటినిల్వ ఉన్నచో ఆ నీటిలో కిరోసిన్ లేక వాడిన ఇంజన్ ఆయిల్ చుక్కలు వేయాలి
* సెప్టిక్ట్ ట్యాంక్ గొట్టాలకు దోమలు వెళ్లకుండా, దోమ తెర గుడ్డ లాంటి ఇనుప జాలీని బిగించాలి
* ఒక వేళ పిల్లలకు జ్వరం వచ్చినచో ఆలస్యం చేయకుండా ఆసుపత్రికి తీసుకెళ్లాలి



  • ==========================================
Visit my website - > Dr.Seshagirirao.com/

No comments:

Post a Comment

Your comment is very important to improve the Web blog.