Tuesday, August 10, 2010

చిన్నపిల్లల కంటి జబ్బుల జాగ్రత్తలు , Eye diseases in Children -precautions


-

పిల్లలకి తల్లిదండ్రులు జన్మనివ్వడమే కాకుండా, జీవితాన్ని ఇవ్వడానికి ప్రయత్నిస్తారు. ప్రేమని పంచుతారు. కంటికి రెప్పలా కాపాడుతారు. శిశువుగా ఉన్నప్పటి నుండీ పెద్దయ్యే వరకు, అన్నపానాలు సమకూరుస్తారు, విద్యా బుద్దులు నేర్పుతారు. జబ్బు చేస్తే పక్కనే ఉండి సేవలు చేసి, వైద్యం చేయించి, కళ్ళల్లో వత్తులు వేసుకుని కాపాడతారు. పిల్లల కంటే వాళ్ళే ఎక్కువగా ‘ఆ జబ్బు పిల్లలకి కాక తమకే వచ్చిందా?’ అన్నట్టు విలవిల్లాడతారు. పిల్లలకు దెబ్బ తగిలితే తాము ’అబ్బా’ అంటారు. కష్టంలో వెన్నంటి ఉంటారు, అభివృద్దిని చూసి ఆనందిస్తారు.
పెద్దవాళ్లకు వచ్చే ప్రతి జబ్బూ పిల్లలకు వస్తుంది. కళ్లజబ్బులు ఇందుకు మినహాయింపు కాదు. పుట్టగానే మనకు వందశాతం చూపు ఉండదు. యాభైశాతం చూపుతోనే పుడతాం. ఆ తరువాత చుట్టూ ఉన్న రంగులు, కాంతి వల్ల కంటిలోని కణాలు ఉత్తేజితం అవుతాయి. తద్వారా మెల్లమెల్లగా మిగిలిన యాభైశాతం చూపు వస్తుంది. ఈ ప్రక్రియలో ఎక్కడ తేడా వచ్చినా మిగతా సగం చూపు అభివృద్ధి చెందదు. పుట్టుకతోనే కంటిలో లోపాలు ఉన్నప్పుడు ఇలాంటి పరిస్థితి ఎదురవుతుంది. పెద్దవాళ్లకు వచ్చే శుక్లాలు, రెటినోపతి, గ్లకోమా లాంటివైతే ఏమాత్రం అశ్రద్ధ చేసినా అంధత్వానికి దారితీస్తాయి. కాబట్టి బుజ్జిపాపాయిల నేత్రాలు పదిలంగా ఉండాలంటే కంటిపరీక్షలు తప్పనిసరిగా చేయించాలి. లేకుంటే రకరకాల జబ్బుల వల్ల సమస్యలు వచ్చిపడతాయి. కంటిలో ఏ సమస్య ఉన్నా ఎనిమిదేళ్లలోపే దానికి చికిత్స చేయించాలి. లేకుంటే ప్రమాదాన్ని నివారించడం కష్టమే. ఆ తరువాత చికిత్స చేయించినా పూర్తి ఫలితం అందుకోలేరు. భవిష్యత్తులో ఏదో ఒక వయసులో చూపు పూర్తిగా దెబ్బతినే అవకాశం కూడా ఉంటుంది.

  • బద్దకించే కన్ను.. లేజీ ఐ
బిడ్డ పుట్టిన తరువాత తగిన కాంతికి తప్పనిసరిగా ప్రభావితం కావాలి. చాలామంది పెద్దవాళ్లు బయటకు తీసుకురావద్దంటూ తల్లినీ, బిడ్డనూ బెడ్రూమ్‌కే పరిమితం చేస్తుంటారు. అదేవిధంగా కొన్ని రకాల ముదురు రంగులకు శిశువుల్ని దూరంగా ఉంచుతుంటారు. కాంతితో పాటు అన్ని రకాల రంగులను బిడ్డ కళ్లు చూడాలి. తగినంత వెలుతురు లేకపోయినా, రంగులను చూడకపోయినా శిశువు కళ్లు సక్రమంగా ఎదగలేవు. పుట్టినప్పుడు ఉన్న దృష్టి సామర్థ్యం దగ్గరే ఆగిపోతుంది. మిగిలిన సగం వృద్ధి కాదు. దీన్నే ''స్టిమ్యులేషన్ డిప్రివేషన్ యాంబయోపియా'' అంటారు. కొన్ని సార్లు ఒక కన్ను దృష్టి బాగా ఉండి, రెండో కన్ను కాంతి, రంగుల ద్వారా పూర్తిగా ప్రేరేపితం కాదు. ఇలాంటప్పుడు ఇది లేజీగా మారిపోతుంది. అంటే దీని దృష్టి సరిగా పెరగదు. దీన్ని సకాలంలో గుర్తించలేకపోతే ప్రమాదమే. దృష్టి బాగున్న కన్నుకు రోజుకి రెండు గంటలు ప్యాచ్‌లాగా వేస్తే లోపం ఉన్న కన్ను ఎక్కువగా స్టిమ్యులేట్ అవుతుంది. మెల్లమెల్లగా దాని దృష్టిసామర్థ్యమూ పెరుగుతుంది. దీన్ని ''ప్యాచ్ ట్రీట్‌మెంట్'' అంటారు.

  • రెటినోపతి ఆఫ్ ప్రీమెచ్యూరిటీ
సాధారణంగా తల్లి గర్భంలో ఉన్నప్పుడే రెటీనా ఎదుగుదల పూర్తవుతుంది. పుట్టేసరికి రెటీనా సరిపడా రక్తనాళాలతో పూర్తిగా ఏర్పడిపోతుంది. కానీ నెలలు నిండకుండానే పుట్టిన శిశువుల్లో రెటీనాలో అన్ని రక్తనాళాలూ ఏర్పడవు. ఈ పరిస్థితి రెటినోపతి ఆఫ్ ప్రీమెచ్యూరిటీ(ఆర్‌ఓపీ)కి దారితీస్తుంది. ఇది బిడ్డ పూర్తి ఆరోగ్యం, పుట్టినప్పుడు ఉన్న బరువు, ఆర్‌ఓపీ తీవ్రత ల మీద ఆధారపడి ఉంటుంది. సకాలంలో గుర్తించి చికిత్స ఇప్పించకపోతే ఆర్‌ఓపీ అంధత్వానికి కూడా దారితీయవచ్చు. ఆర్‌ఓపీ ఉన్నవాళ్లు గ్లకోమా, శుక్లాలు, దృష్టిలోపాల వంటి సమస్యల బారినపడే అవకాశం ఎక్కువ. చుక్కల మందు వేసి రెటీనాను పరీక్ష చేయడం ద్వారా దీన్ని గుర్తించవచ్చు. సర్జరీ ద్వారా దీన్ని సరిచేయవచ్చు.

  • కంటిలో శుక్లాలు
శుక్లాలు ఉన్నాయంటే ఏ అరవయ్యేళ్ల వృద్ధులో అనుకుంటాం. అంటే శుక్లాలు అంటే వృద్ధుల కంటిజబ్బు అన్న అభివూపాయం ఉంది. కానీ చిన్నారుల్లో, అప్పుడే పుట్టిన వారిలో కూడా కంటిలో శుక్లాలు ఉండవచ్చు. గర్భంతో ఉన్నప్పుడు తల్లికి మధుమేహం ఉన్నా, రుబెల్లా, తట్టు, చికెన్‌పాక్స్, ఫ్లూ లాంటి వైరల్ జ్వరాలు వచ్చినా, ఏవైనా గాయాలు అయినా, గర్భసంచి ఏ కారణం చేతనైనా ఒత్తిడికి గురయినా, ఉమ్మనీరు తగినంత లేకపోయినా బిడ్డ కంటిలో శుక్లాలతో పుట్టవచ్చు. కొన్నిసార్లు మందుల దుష్ప్రభావం వల్ల కూడా రావచ్చు. ఉదాహరణకి గర్భిణులకు టెట్రాసైక్లిన్ లాంటి యాంటిబయాటిక్స్ వాడినప్పుడు బిడ్డకు శుక్లాలు వచ్చే అవకాశం ఉంటుంది.

  • కంజెనిటల్ గ్లకోమా
కంటిలోని డ్రైనేజ్ చానళ్లు సక్రమంగా ఏర్పడకపోవడం వల్ల పుట్టుకతోనే నీటికాసుల వ్యాధి వచ్చే అవకాశం ఉంది. దీనివల్ల ఎక్కువ ద్రవం తయారవుతుంది కానీ బయటకు వెళ్లే దారి లేక కన్నులోనే ఉండిపోతుంది. ఈ ద్రవాన్ని కంటి నుంచి బయటకు తీసుకెళ్లే దారే డ్రైనేజ్ చానల్. ఇది ద్రవాన్ని తీసుకెళ్లలేదు కాబట్టి కంటిలో ద్రవం ఎక్కువై పీడనం కూడా పెరుగుతుంది. తద్వారా రెటీనా పగిలిపోయే ప్రమాదం ఉంటుంది. దృష్టినాడి కూడా దెబ్బతిని శాశ్వతంగానే చూపు పోవచ్చు. దీన్ని ప్రైమరీ కంజెనిటల్ గ్లకోమా అంటారు. కొన్నిసార్లు గర్భంలో ఉన్నప్పుడు పుట్టేటప్పుడే చిన్న చిన్న దెబ్బలు తగిలితే అవి తరువాత గ్లకోమా సమస్యను తెచ్చిపెట్టవచ్చు. నీటికాసులున్నట్టు లక్షణాల ద్వారా తెలుసుకోవడం కష్టం. కాబట్టి కంటిపరీక్షలు చేయించడమే ఉత్తమం. ఇవి సాధారణంగా బిడ్డ పుట్టగానే లేదా పుట్టిన ఏడాదిలోపే తెలుసుకోవచ్చు.


  • మెల్లకన్ను
కనుగుడ్డు చుట్టూ ఉండే కండరాలు మెదడు ఆదేశానుసారం కళ్లను అటూ ఇటూ కదిలించడానికి తోడ్పడతాయి. వీటి పనితీరు దెబ్బతింటే అవి సరైన విధంగా కదలవు. అది మెల్లకన్నుకు దారితీస్తుంది. సాధారణంగా చాలామంది శిశువుల్లో మెల్ల ఉన్నట్టు అనిపిస్తుంది. కానీ పెరిగిన కొద్దీ పోతుంది. దీన్ని సూడోస్కింట్ అంటారు. ముక్కు సైజు పెరిగిన కొద్దీ కంటి కండరాలు బాగైపోయి మెల్ల పోతుంది. కొన్నిసార్లు మాత్రం కంటిలో ఇతర సమస్యలుంటే మెల్ల ఏర్పడుతుంది. ఈ మెల్లకన్నును అయిదేళ్లలోపు గుర్తించి సరిచేయించకపోతే మాత్రం కంటిజబ్బులకు గురవుతారు.


Article : courtesy with Kaasu prasadareddy , Director , Maxivison Eye hospital - Hyd @Namasthe Telangana.com

  • పిల్లలలో దృస్టిలోపము , అంధత్వనివారణకు తల్లిదండ్రులు పాటించాల్చిన జాగ్రత్తలు :

పిల్లలకు పుట్తుకతోనే కొన్ని జబ్బులు వస్తుంటాయి . తరువాతి క్రమము లో పోషకాహార లోపముతో , బయటి ఇన్‌ఫెక్షన్‌ వలన అనేక జబ్బులు వస్తాయి . వీటిలో
  1. మయోపియా , 
  2. గ్లకోమా , 
  3. కంజక్టవైటిస్ ,
  4. స్ట్రెబిస్మస్ , 
  5. ఎంబ్లయోపియా , 
  6. టియర్ (కన్నీరు)డక్ట్ (నాళము) మూసికపోవడం , 
  7. టొసిస్(కనురెప్పలు వాలిపోవడం), 
  8. రెటినోపతి , 
  9. చిన్నపిల్లలలో కంటి కుసుమాలు ,
  10. మెల్లకన్ను , 
  11. కంటి క్యాన్‌సర్(ఆర్బి్టల్ ట్యూమర్స్ ) ముఖ్యమైనవి .

మయోపియా (హ్రస్వ దృష్టి) : దగ్గర వస్తువులు కనిపిస్తాయి , దూరము వస్తువులు స్పస్తం గా కనిపించవు లేక పూర్తిగా కనిపించవు . డాక్టర్ చే తనికీ చేయించి తగిన అద్దాలు వాడాలి .

మెల్లకన్ను : మెల్లకన్ను పై ప్రజలలో మూఢనమ్మకాలు ఉన్నాయి . ఇది ఉంటే అదృస్టము అంటారు . కాని దీనిని ఇర్లక్షము చేస్తే దృస్టి క్రమముగా తగ్గిపోతుంది .. పూర్తిగా దృస్టి పోయే ప్రమాదమూ ఉంది . శస్త్ర చికిత్స ద్వారా నయము చేయవచ్చును .

కండ్ల కలకలు : ఇన్‌ఫెక్షన్‌ వలన కళ్ళు పుసికట్టి , ఎరుపుగా ఉంది నుసివేస్తాయి . తగిన డాక్టర్ చే కంటి చుక్కలమందు , యాంటిబయోటిక్స్ వాడితే సరిపోతుంది .

ఏది ఏమైనా చిన్నపిల్లల విషయము లో అస్రద్ద చేయకుండా తగిన చికిత్స చేయించాలి .

  • జాగ్రత్తలు :
క్రమము తప్పకుండా పౌస్టికాహారము ఇవ్వాలి ,
విటమిం 'ఎ' ఎక్కువ ఉన్న ఆహారము ఇవాలి ,
అంటువ్యాధులు ఉన్నవారికి దూరము గా ఉంచాలి ,

  • ========================================
Visit my website - > Dr.Seshagirirao.com/

No comments:

Post a Comment

Your comment is very important to improve the Web blog.